మహారాష్ట్ర, సతారా లోక్సభ సీటు నుంచి ఎన్సిిపి టికెట్పై గెలిచి తర్వాత బిజెపిలో చేరిన ఉదయన్రాజే భోంస్లే
(న్యూస్ ఆర్బిట్ బ్యూరో)
అల్పేష్ ఠాకూర్. ఈ పేరు ఎక్కడో విన్నట్లుంది కదూ. అవును ఈ పేరు 2017 గుజరాత్ శాసనసభ ఎన్నికల సందర్బంగా చాలా నలిగింది. గుజరాత్లో మోదీ నాయకత్వంలోని బిజెపిని ఎదుర్కొనేందుకు నడుం బిగించిన ముగ్గురు యువనాయకుల్లో అల్పేష్ ఠాకూర్ ఒకరు. పాటీదార్లకు కోటా ఎజెండాతో ప్రజాజీవనంలోకి వచ్చిన హార్దిక్ పటేల్ అనతికాలంలోనే గుజరాత్ రాజకీయాల్లో ఒక శక్తిగా గుర్తింపు పొందారు. దళితుల నాయకుడిగా జిగ్నేష్ మేవానీ హిందూత్వ శక్తులపై పోరాటంతో నలుగురి దృష్టినీ ఆకర్షించారు. అలాగే అల్పేష్ ఠాకూర్ వెనుకబడిన వర్గాల యువనాయకుడిగా పేరు సంపాదించారు. ఈ ముగ్గురూ గుజరాత్ ఎన్నికలలో కాంగ్రెస్తో చేతులు కలిపారు.
శుక్రవారం వెలువడిన ఉపఎన్నికల ఫలితాలలో అల్పేష్ ఠాకూర్ పరాజయం పాలయ్యారు. విషయం ఏమంటే గత ఎన్నికలలో కాంగ్రెస్ టికెట్పై గెలుపొందిన అల్పేష్ ఠాకూర్ నాటకీయంగా ఆ పార్టీకి రాజీనామా చేసి బిజెపిలో చేరారు. బిజెపి వ్యతిరేక రాజకీయాలతో గుర్తింపు పొందిన వ్యక్తి మళ్లీ అదే పార్టీ పంచన చేరారు.
పార్టీ మారిన కారణంగా రాజీనామా చేయడంతో రాధాన్పూర్ స్థానానికి ఉపఎన్నిక జరిగింది. క్రితం సారి ఎన్నికలలో అల్పేష్ ఠాకూర్ను గెలిపించిన ప్రజలే ఈసారి ఆయనను ఓడించారు. దీనిని బట్టి వోటర్ల విజ్ఞత ఏమిటో అర్ధమవుతోంది. ఫిరాయింపుదారులను వోటర్లు తిరస్కరించాలని ప్రజాస్వామ్యవాదులందరూ కోరుకుంటారు. ఆ విధంగా చూస్తే ఈ ఫలితం స్వాగతించదగినది.
మహారాష్ట్ర, హర్యానా రాష్ట్ర శాసనసభ ఎన్నికలతోపాటు జరిగిన ఉప ఎన్నికలలో ఇదొక్కటే కాదు ఇలాంటి ఫలితం. మహారాష్ట్రలోని సతారా లోక్సభ నియోజకవర్గం ఉపఎన్నికలో ఓడిపోయిన ఉదయన్రాజే భోంస్లే కథ కూడా ఇలాంటిదే. 2019 సార్వతిరక ఎన్నికలలో ఆయన శరద్ పవార్ నాయకత్వలోని ఎన్సిపి నుంచి పోటీ చేసి గెలిచారు. అనంతరం బిజెపిలోకి ఫిరాయించారు. ఈ కారణంగా వచ్చిన ఉపఎన్నికలో బిజెపి టికెట్పై పోటీ చేసి ఓడిపోయారు. ఫిరాయింపుదారులను వోటర్లు తిరస్కరించడం ఆహ్వానించదగిన పరిణామమని అంటున్నారు.