(న్యూస్ అర్బిట్ డెస్క్)
చిన్న పిల్లలను అపహరించే ముఠా అన్న అనుమానంతో మధ్యప్రదేశ్లో ముగ్గురు కాంగ్రెస్ నాయకులను పట్టుకుని చితకబాదారు. బేతుల్ జిల్లాలోని నావల్సింహ్ గ్రామం వద్ద గురువారం రాత్రి ఈ సంఘటన జరిగింది.
పిల్లలను కిడ్నాప్ చేసే ముఠా ఒకటి తిరుగుతుందన్న పుకార్లతో నావల్సింహ్ వద్ద గ్రామస్థులు చెట్లు నరికి రోడ్డుకు అడ్డంగా పడేశారు. స్థానిక కాంగ్రెస్ నాయకులు ముగ్గురు – ధర్మేంద్ర శుక్లా, ధర్ముసింగ్ లాంజివార్, లలిత్ బరాస్కర్ – కారులో అటుగా వెళుతున్నారు. రోడ్డుకు అడ్డంగా చెట్టు చూసి దారిదోపీడీ దొంగల పని అయిఉంటుందన్న భయంతో కారు వెనక్కు తిప్పారు. అక్కడే పొంచి ఉన్న గ్రామస్థులు వెంటబడి వారిని పట్టుకున్నారు. ముగ్గురినీ బాగా కొట్టారు. వాహనం ధ్వంసం చేశారు.
పిల్లలను అపహరిస్తున్నారన్న పుకార్ల ఫలితంగా మధ్యప్రదేశ్ రాష్ట్రంలో గత వారంలో కనీసం డజను కేసుల్లో మూక దాడులు జరిగాయి. మూడు కేసులు బేతుల్ జిల్లాలోనే చోటుచేసుకున్నాయి.
దేవస్లో పోలీసులు సకాలంలో స్పందించిన కారణంగా వికలాంగురాలైన ఒక మహిళ మూక దాడి నుంచి తప్పించుకుంది. రైసెన్ జిల్లాలో గత వారం ఒక మధ్యవయస్కుడి మృతదేహం దొరికింది. ఆతను మూక దాడిలో ప్రాణాలు కోల్పోయి ఉంటాడని పోలీసులు భావిస్తున్నారు.