హైదరాబాద్: కాంగ్రెస్ పార్టీ నుండి మరో ఎమ్మెల్యే పార్టీ మారేందుకు సిద్ధమయ్యారు. అయితే ఇక్కడ విశేషం ఏమిటంటే ఇప్పటి వరకూ పార్టీ మారిన 12మంది ఎమ్మెల్యేలు అధికార టిఆర్ఎస్లో చేరగా ఈ ఎమ్మెల్యే మాత్రం కేంద్రంలో అధికారంలో ఉన్న బిజెపిలో చేరడానికి సిద్ధమయ్యారు.
కాంగ్రెస్ పార్టీ క్రమశిక్షణా సంఘం నుండి నోటీసు అందుకున్న నల్లగొండ జిల్లా మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాలరెడ్డి కాంగ్రెస్ పార్టీని వీడి బిజెపిలో చేరాలని నిర్ణయించుకున్నారు.
రాజగోపాల్ రెడ్డికి పార్టీ షోకాజ్ నోటీసు జారీ చేస్తూ పది రోజుల్లో వివరణ ఇవ్వాలనీ లేకుంటే క్రమశిక్షణా చర్యలు తీసుకోనున్నట్లు పేర్కొంది. ఈ మేరకు కాంగ్రెస్ సీనియర్ నేత ఎం కోదండరెడ్డి నేతృత్వంలోని పిసిసి క్రమశిక్షణా సంఘం బుధవారం నోటీసు జారీ చేశారు. ఏఐసిసి అధ్యక్షుడితో పాటు ఏఐసిసి రాష్ట్ర ఇన్చార్జి కుంతియా, టిపిసిసి అధ్యక్షుడు ఉత్తమ్కుమార్ రెడ్డిలపై ఈ నెల 15న నల్లగొండలో చేసిన వ్యాఖ్యలపై వివరణ ఇవ్వాలని నోటీసులో ఆదేశించారు. అదే సందర్భంలో కాంగ్రెస్ పార్టీకి భవిష్యత్తు లేదనీ, టిఆర్ఎస్కు వ్యతిరేకంగా పోరాడే ప్రత్యామ్నాయం ప్రధాని మోది నేతృత్వంలోని బిజెపి మాత్రమేనని వ్యాఖ్యానించిన విషయాన్ని నోటీసులో పేర్కొన్నారు.
ఈ నేపథ్యంలో రాజగోపాలరెడ్డి బిజెపిలో చేరేందుకు అవసరమైన ఏర్పాట్లు చేసుకుంటున్నారు. మునుగోడుకు చెందిన ముఖ్యనేతలతో బుధవారం రాత్రి హైదరాబాదులోని తన నివాసంలో ఆయన భేటీ అయ్యారు. తాను ఎమ్మెల్యేగానే కొనసాగుతాననీ, బిజెపిలో కీలక పదవి వస్తుందని రాజగోపాలరెడ్డి వారితో చెప్పినట్లు తెలుస్తోంది. మండలానికి ఐదుగురు ముఖ్యనాయకులను పిలిపించుకొని ఆయన మాట్లాడారు. కాంగ్రెస్ పార్టీలో కొనసాగేది లేదని తేల్చి చెప్పినట్లు సమాచారం. ఈ రోజు సాయంత్రం మరో సారి కార్యకర్తలతో సమావేశమై తన నిర్ణయాన్ని అధికారికంగా ప్రకటించనున్నారు. రాజగోపాలరెడ్డి సోదరుడు కోమటిరెడ్డి వెంకటరెడ్డి మాత్రం తాను పార్టీ మారనని స్పష్టం చేసినట్లు తెలుస్తోంది.
ఇప్పటికే కాంగ్రెస్ పార్టీకి చెందిన మాజీ మంత్రి డికె అరుణ బిజెపిలో చేరిన విషయం తెలిసిందే.
కాంగ్రెస్ పార్టీ నుండి గెలిచిన 19మంది ఎమ్మెల్యేలలో ఇప్పటికే 12మంది పార్టీ ఫిరాయించారు. వీరు మూడింట రెండు వంతులకన్నా ఎక్కువ కావడంతో సిఎల్పిని టిఆర్ఎస్ శాసనసభాపక్షంలో విలీనం చేస్తూ స్పీకర్ నిర్ణయం తీసుకున్నారు. స్పీకర్ నిర్ణయాన్ని కాంగ్రెస్ పార్టీ కోర్టులో సవాల్ చేసింది.
.