కరోనా లాక్ డౌన్ వేళ వైన్ షాప్ ల వద్ద మందు బాబుల జాతర తెలుగు ప్రజలకు కనువిందు చేసింది. మూడవ విడత లాక్ డౌన్ పొడిగింపు నేపథ్యంలో పలు ఆంక్షలను సడలించిన కేంద్ర ప్రభుత్వం మద్యం అమ్మకాలు జరుపుకోవచ్చంటూ అనుమతి ఇవ్వడంతో ఏపీలోనూ మద్యం దుకాణాలు తెరుచుకున్నాయి. అయితే నిబంధనలు పాటించని రీతిలో పలు వైన్ షాపుల వద్ద మందు బాబులు క్యూలైన్లలో ఒకరినొకరు తోసుకుంటూ నిలుచోవడం విమర్శలకు తావు ఇచ్చింది. దాదాపు 40 రోజుల తరువాత మద్యం దుకాణాలు తెరుచుకోవడంతో ఆవురావురుమంటూ ఎదురు చూస్తున్న మందుబాబులు ఒక్కసారిగా రోడ్డు మీదకు వచ్చారు. భారీ సంఖ్యలో వైన్ షాప్ ల వద్ద కు జనాలు చేరుకోవడంతో ప్రజలను కంట్రోల్ చేయడానికి పోలీసులు నానా తంటాలు పడాల్సి వచ్చింది. ఒకానొక దశలో పోలీసులు కొన్ని చోట్ల లాఠీ ఛార్జ్ కూడా చేసినట్టు తెలుస్తోంది. మందుబాబులను కంట్రోల్ చేయడం కంటే కరోనాను కంట్రోల్ చేయడం ఈజీ అని కొంత మంది వ్యాఖ్యానించారు.
ఇదిలా ఉంటే కరోనా లాక్ డౌన్ వేళ మద్యం దుకాణాలు తెరవడం, ధరలను 25 శాతం పెంచడంపై ప్రతిపక్షాలు విమర్శలు సంధిస్తున్నాయి.
జగనన్న బీరు పండుగ
రాష్ట్రంలో మద్యం షాపులు తెరవడంపై టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ స్పందించారు. రాష్ట్రంలో కరోనా విజృంభిస్తున్న సమయంలో ‘జగనన్న బీరు పండుగ’ ఘనంగా ప్రారంభమైందని ఎద్దేవా చేశారు. మద్య నిషేధం మాటున చీకటి దందా సాగుతోందని ఆరోపించారు. మద్య నిషేధం అంటే రేట్లు పెంచడం, వైన్ కేసుల్లో కమీషన్లు తీసుకుని ప్రమాదకరమైన లిక్కర్ విక్రయించి ప్రజల ఆరోగ్యాలతో చెలగాటం ఆడడమని వైఎస్ జగన్ సరికొత్త అర్థం చెప్పారని లోకేశ్ విమర్శించారు. లాక్ డౌన్ సమయంలో వైసీపీ ఎలుకలు తాగిన కోట్ల రూపాయల మద్యం లెక్కలు సరిచేసేందుకే లిక్కర్ అమ్మకాలకు పచ్చజెండా ఊపారని లోకేష్ ఆరోపించారు.
కరోనాను మందు బాబులే వ్యాపింపజేసేలా ఉన్నారు
మద్యం అమ్మకాలను ప్రారంభించడంపై ప్రముఖ సినీ నటుడు, జనసేన నేత నాగబాబు స్పందించారు. కేంద్ర ప్రభుత్వం ఇంత అర్జెంటుగా మద్యం షాపులు తెరవడం సరికాదని ఆయన అభిప్రాయపడ్డారు. ఇదో పెద్ద తప్పిదంలా అనిపిస్తోందని, ప్రజలు కూడా మందు విషయంలో విచక్షణ కోల్పోతున్నారని ట్వీట్ చేశారు. చూస్తుంటే, మందుబాబులే కరోనా వైరస్ ను వ్యాపింపచేసేలా ఉన్నారని, ఇది చాలా దారుణమైన పరిస్థితి అని నాగబాబు పేర్కొన్నారు.
తమిళనాడు సరిహద్దుల్లోని మద్యం దుకాణాల వద్ద ఉద్రిక్తత!
పొరుగు రాష్ట్రమైన తమిళనాడులో ప్రస్తుతం మద్యం అమ్మకాలపై నిషేధం ఉండటంతో అక్కడి మందు బాబులు ఏపి బాట పట్టారు. ఈ క్రమంలో నెల్లూరు జిల్లాలోని ఏపీ, తమిళనాడు సరిహద్దుల్లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. జీవీపాలెం, రామాపురంలోని మద్యం దుకాణాల వద్దకు తమిళనాడు వాసులు పెద్ద సంఖ్యలో రావడంతో ఈ పరిస్థితులు నెలకొన్నాయి. జీవీపాలెం, రామాపురంలోని ఏడు మద్యం దుకాణాల వద్దకు పోలీసులు చేరుకుని మద్యం షాపులను మూసివేయించి తమిళనాడు వాసులను వెనక్కి పంపించారు. అదే విధంగా చిత్తూరు జిల్లాలోని పాలసముద్రంలోనూ మద్యం అమ్మకాలు కొద్ది సేపు నిలుపుదల చేసినట్లు సమాచారం.
మద్యం షాపుల వద్ద స్థానిక రగడ
గ్రీన్ జోన్లలోని మద్యం దుకాణాలకు రెడ్ జోన్లలోని మందుబాబులు రావడంపై ఆ ప్రాంత వాసులు ఆందోళనకు దిగుతున్నారు. గుంటూరు జిల్లాలోని మాచవరం, పిల్లుట్లలోని మద్యం దుకాణాల వద్ద మందుబాబులు బారులు తీరారు. ఇతర గ్రామాల వారు తమ గ్రామంలోని మద్యం దుకాణాల వద్దకు వచ్చారంటూ పిల్లుట్ల గ్రామస్తులు ధర్నాకు దిగారు. రెడ్ జోన్ల లో ఉన్న వారు గ్రీన్ జోన్లలోకి మద్యం కొనుగోలు నిమిత్తం రావడంపై వారు నిరసన వ్యక్తం చేశారు.
మద్యం షాపుల వద్ద మహిళల నిరసన
మద్యం అమ్మకాలు ప్రారంభించడంపై పలు ప్రాంతాలలో మహిళలు ఆందోళన చేశారు. మద్యం అమ్మకాలు నిలుపుదల చేయాలని డిమాండ్ చేస్తూ నినాదాలు చేశారు.