కాకినాడ: తూర్పుగోదావరి జిల్లా కచ్చలూరు వద్ద గోదావరిలో మునిగిపోయిన రాయల్ వశిష్ట బోటును ధర్మాడి సత్యం టీమ్ విజయవంతంగా బయటకు తీసింది. దీంతో నెల రోజుల నిరీక్షణకు తెరపడింది. డీప్ డైవర్లు నీటి అడుగు భాగం నుంచి లంగర్లు, తాళ్ల సాయంతో బోటును పైకి లాక్కొచ్చారు. వెలికి తీసిన బోటులో హృదయ విదారక దృశ్యాలు కనిపిస్తున్నాయి. బోటులో ఐదు మృతదేహాలు బయటపడ్డాయి. 38 రోజులుగా ఆ మృతదేహాలు బోటులోనే ఉన్నాయి. బోటును వెలికితీయడంతో ఆ డెడ్బాడీలు బయటపడ్డాయి. అయితే, అవి కుళ్లిపోయిన స్థితిలో ఉండడంతో ఎవరివనేది గుర్తించడం కష్టంగా మారింది. మరిన్ని మృతదేహాలను వెలికి తీయాల్సి ఉంది. పూర్తిగా ధ్వంసమైన స్థితిలో బోటు ఉంది. బోటును వెలికితీస్తున్న సమయంలో మొదట కొన్ని భాగాలుగా విడిపోయి బయటకు వచ్చాయి. అయినా పట్టు సడలకుండా దాన్ని వెలికితీశారు. బోటు బయటకి రావడంతో మృతుల కుటుంబాలు కన్నీటిపర్యంతం అవుతున్నారు
సెప్టెంబర్ 15న పర్యాటకులతో బయలుదేరిన రాయల్ వశిష్ట బోటు కచ్చులూరు వద్ద మునిగిపోయిన విషయం తెలిసిందే. ప్రమాదం జరిగిన సమయంలో అందులో 77 మంది ఉన్నారు. వీరిలో 39 మంది మృతిచెందగా 26 మంది సురక్షితంగా బయటపడ్డారు. 12 మంది గల్లంతయ్యారు. మృతదేహాలు బోటు అడుగున ఇరుక్కుని ఉంటాయని అంచనా వేశారు. బోటును బయటకు తీయడంతో గల్లంతైన వారి ఆచూకీ లభించే అవకాశముందని అధికారులు భావిస్తున్నారు. బోటును వెలికితీయడంతో పాటుగా మృతదేహాల కోసం సెప్టెంబర్ 28న ఆపరేషన్ ప్రారంభమైంది. కాకినాడకు చెందిన బాలాజీ మెరైన్ సంస్థకు 22.7లక్షల కాంటాక్ట్ ఇచ్చారు. ధర్మాడి సత్యం బృందం ఈ పనులు చేపట్టింది. తొలుత ఐదు రోజుల పాటు సాగించిన ప్రయత్నాలు ఫలించలేదు. అదే సమయంలో గోదావరికి వరద పోటెత్తడంతో అక్టోబర్ 3న ఆపరేషన్ నిలిపివేశారు.
గోదావరి శాంతించడంతో అక్టోబర్ 16 నుంచి మరోసారి ప్రయత్నాలు ప్రారంభించారు. తొలుత ధర్మాడి సత్యం బృందం చేసిన ప్రయత్నాల ప్రకారం లంగరుకి బోటు తగలడంతో ఒడ్డుకి చేరుతుందని ఊహించినప్పటికీ అది నెరవేరలేదు. దాంతో ప్లాన్ మార్చారు. విశాఖ నుంచి డైవర్లను రంగంలో దింపారు. ఆక్సిజన్ సిలిండర్ల సహాయంతో నది అడుగు భాగానికి వెళ్లాలని నిర్ణయించి రెండు రోజులుగా ఈ ప్రయత్నాలు చేస్తున్నారు. గోదావరిలో నీటి మట్టం తగ్గడంతో అందుకు అవకాశమేర్పడింది. చివరకు సోమవారం మధ్యాహ్నం 2 గంటల ప్రాంతంలో బోటులో కొన్ని భాగాలు బయటకు వచ్చాయి. బోటు మునిగిన 38 రోజుల తర్వాత వెలికి తీసే ప్రయత్నాలు ఫలించాయి. మంగళవారం బోటును వెలికితీసే పనిలో ధర్మాడి సత్యం బృందం సక్సెస్ అయింది.