ఢిల్లీ: దేశ వ్యాప్తంగా ఈ నెల 1వ తేదీ నుంచి అమల్లోకి వచ్చిన కొత్త మోటార్ వాహన చట్టం రూల్స్ సామాన్యులకు చుక్కలు చూపిస్తున్నాయి. కొత్త వాహన చట్టం ద్వారా వసూళ్లు చేస్తున్న జరిమానాలు వాహనదారుల గుండెల్లో గుబులు పుట్టిస్తోంది. తాజాగా గురుగ్రామ్లో ఓ వ్యక్తిగి ఏకంగా రూ.23 వేల జరిమానా విధించారు. ఢిల్లీలోని గీతా కాలనీకి చెందిన దినేష్ మదన్ అనే వ్యక్తిని బైక్ పై వెళ్తుండగా.. పోలీసులు ఆపారు. అయితే, సమయానికి దినేష్ దగ్గర ఏమీ లేకపోవడంతో… కొత్త నిబంధనల ప్రకారం జరిమానా విధించారు. ఏకంగా రూ.23,000 జరిమానా వేశారు. లైసెన్స్, ఆర్సీ, హెల్మెట్.. ఇలా లెక్కలు తీసి చూపించారు. ట్రాఫిక్ పోలీసులు రాసిన చలాన్లు చూసి దినేష్ షాక్ తిన్నాడు.
మదన్కు లైసెన్స్ లేకుండా డ్రైవింగ్ చేసినందుకు రూ.5 వేల జరిమానా, రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ లేనందుకు మరో ఐదు వేలు, థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ లేనందుకు రెండు వేలు, వాయు కాలుష్య ప్రమాణాలు పాటించనందుకు రూ. 10 వేలు, హెల్మెట్ ధరించనందుకు రూ.వెయ్యి జరిమానా విధించారు. దాంతో ఏకంగా ఆ మొత్తం 23 వేల రూపాయలు అయ్యింది.
అయితే తన హోండా యాక్టివా బైక్ చాలా పాతదని, బండి ఖరీదు రూ.15 వేలకు మించి ఉండదని మదన్ వాపోయాడు. హెల్మెట్ లేకుండా వస్తున్న తనకు రూ. వెయ్యి చలాన్ రాసినట్లు చెప్పాడు. 10 నిమిషాల్లో అన్ని పత్రాలు చూపిస్తానని చెప్పినా.. పోలీసులు భారీ ఫైన్ విధించారని ఆవేదన వ్యక్తం చేశాడు.