ముంబై: దేశ ఆర్థిక రాజధాని ముంబై నగరాన్ని వర్షాలు అతలాకుతలం చేస్తున్నాయి. రాత్రి నుంచి ఎడతెరిపి లేకుండా వాన దంచి కొడుతోంది. ఏకధాటిగా కురుస్తున్న వర్షాలతో ముంబై వాసులకు ఇక్కట్లు పడుతున్నారు. నగరంలోని రోడ్లన్నీ జలమయం అయ్యాయి. వరదనీటిలో లోతట్టు ప్రాంతాల ప్రజలు అవస్థలు పడుతున్నారు. వర్షాలతో ముంబైలో రవాణ వ్యవస్థ స్తంభించింది. పలు చోట్ల ట్రాఫిక్ జాంతో వాహనదారులు ఇక్కట్లు పడ్డారు. దీంతో వివిధ పనులు, కార్యాలయాలకు వెళ్లే వారు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. మరోవైపు రైళ్ల రాకపోకలకు కూడా తీవ్ర అంతరాయం ఏర్పడింది. పలు రైళ్లు ఆలస్యంగా నడుస్తున్నాయి. వాతావరణం అనుకూలించకపోవడంతో కొన్ని విమాన సర్వీసులను కూడా రద్దు చేశారు. వర్షాల నేపథ్యంలో స్కూళ్లకు ప్రభుత్వం సెలవు ప్రకటించింది. బుధవారం, గురువారం కూడా ముంబై, పుణె నగరాల్లో భారీ వర్షం కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ప్రజలు బయటకు వచ్చేటప్పుడు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఐఎండీ అధికారులు సూచించారు. ఏదైనా అవసరం ఉంటే 1916 నెంబర్కు ఫోన్ చేయాలని, లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు.
https://twitter.com/mybmc/status/1169075176123727872