ముంబాయి: మహారాష్ట్ర రాజకీయాల్లో ఊహించని పరిణామాలు చోటుచేసుకున్నాయి. ఉద్ధవ్ ఠాక్రే ముఖ్యమంత్రిగా సంకీర్ణ ప్రభుత్వం ఏర్పడనుందని అందరూ భావిస్తుండగా రాత్రికి రాత్రి జరిగిన అనేక రాజకీయ పరిణామాల నేపథ్యంలో బిజెపి శాసనసభాపక్ష నేత, మాజీ సిఎం దేవేంద్ర ఫడ్నవీస్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. డిప్యూటి సిఎంగా ఎన్సిపి సీనియర్ నేత అజిత్ పవార్ ప్రమాణ స్వీకారం చేశారు. శనివారం ఉదయం రాజ్భవన్లో గవర్నర్ భగత్ సింగ్ కోశ్యారీ వారిచే ప్రమాణ స్వీకారం చేయించారు.
శివసేనతో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం ఖాయమని ఎన్సిపి చీఫ్ శరద్ పవార్ శుక్రవారం రాత్రే ప్రకటించిన విషయం తెలిసిందే. దీంతో బిజెపి రాజకీయ వ్యూహం రచించి అజిత్ పవార్తో రహస్య మంతనాలు చేసింది. ఈ నేపథ్యంలో తమకు మరో సారి అవకాశం ఇవ్వాలని ఇరుపార్టీల నేతలు గవర్నర్ను కోరారు. అసెంబ్లీలో తమకు సంపూర్ణ మెజార్టీ ఉందని ఫడ్నవీస్ పేర్కొన్నారు. సుస్థిరమైన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని ఆయన పేర్కొన్నారు. సిఎం పీఠంపై ఆశలు పెట్టుకున్న శివసేనకు ఎన్సిపి ఊహించని షాక్ ఇచ్చింది. అజిత్ పవార్ వెంట 20 మందికిపైగా ఎమ్మెల్యేలు ఉండటంతో బిజెపికి మద్దతు తెలిపినట్లు తెలుస్తోంది. ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన ఫడ్నవీస్కు ప్రధాని మోది శుభాకాంక్షలు తెలిపారు.
కాగా దేవేంద్ర ఫడ్నవీస్ బలనిరూపణకు గవర్నర్ వారం రోజులు సమయం ఇచ్చారు. ఈ నెల 30వ తేదీలోగా సిఎం ఫడ్నవీస్ బలనిరూపణ చేసుకోవాల్సి ఉంటుంది.