కాంగ్రెస్ ప్రకటనలో మూడో చెయ్యి వివాదం
న్యూఢిల్లీ: కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ ఒక ముదుసలి అవ్వను ఆప్యాయంగా ఆలింగనం చేసుకున్న ఫొటో ఒకటి కాంగ్రెస్ పార్టీ ప్రకటనలలో కనిపిస్తోంది. తన న్యాయ్ పథకం ప్రచారం కోసం పార్టీ ఈ పోస్టరును విడుదల చేసింది. అయితే, అందులో రాహుల్ గాంధీకి ఉన్న రెండు చేతులతో పాటు.. మరో మూడో చెయ్యి కూడా కనిపిస్తోంది. ఈ విషయాన్ని గుర్తించిన ఢిల్లీ బీజేపీ అధికార ప్రతినిధి తేజీందర్ పాల్ సింగ్ బగ్గా.. ఆ ప్రకటన ఫొటోను ట్వీట్ చేసి, అందులో మూడో చెయ్యిని గుర్తించారు. ‘‘ఈ మూడో చెయ్యి ఎవరిది రాహుల్ గాంధీ జీ, నేను మీకు నిన్ననే చెప్పాను.. మంచి పీఆర్ ఏజెన్సీని తీసుకోండి’’ అని ఆయన వ్యాఖ్యానించారు.
ఏబీపీ న్యూస్ పాత్రికేయుడు వికాస్ భౌదౌరియాకు కూడా సరిగ్గా ఇదే అనుమానం వచ్చి ఆయన కూడా ఈ ఫొటోను ట్వీట్ చేశారు. దానికి కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ సమాధానం ఇచ్చారు. కాంగ్రెస్ పార్టీకి ఉన్న అదృశ్య హస్తం చూస్తుంటే.. ఆ పార్టీ అవినీతి ఆలోచనలు బయటపడుతున్నాయన్నారు. పార్టీ ప్రకటనలలోనే అదృశ్య హస్తం స్పష్టంగా కనిపిస్తుంటే, ఇక ‘కాన్’గ్రెస్ భ్రష్ట ఆలోచనల మూలం ఇంకెంత లోతుల్లో ఉందోనంటూ ఎద్దేవా చేశారు. బీజేపీ జాతీయ సాహితీ విభాగం సహాధిపతి వికాస్ ప్రీతమ్ భౌదౌరియా ట్వీటును ప్రస్తావిస్తూ ఆయన కూడా విమర్శించారు.
Can you find out three hands of @RahulGandhi in 1st picture if not than plz see second one …ये तीसरा हाथ किसका है ? pic.twitter.com/OZyHS1ZXkW
— Vikas Bhadauria (ABP News) (@vikasbha) April 8, 2019
ఇంతకీ ఏంటా మూడో చెయ్యి?
కాంగ్రెస్ పార్టీ తమ న్యాయ్ పథకం ప్రకటన కోసం ఉపయోగించిన ఫొటోలో నిజానికి ఇంకా చాలామంది ఉన్నారు. అయితే ప్రజల దృష్టి మొత్తం కేవలం రాహుల్ గాంధీ మీద, ఆ వృద్ధురాలి మీద మాత్రమే పడాలన్న ఉద్దేశంతో, మిగిలినవాళ్లందరినీ బ్లర్ చేసి, కేవలం వీళ్లిద్దరి ఫొటోలే బాగా కనిపించేలా ఫొటోషాప్ ద్వారా మార్చారు. చుట్టూ అందరూ ఉన్న ఫొటోను కాంగ్రెస్ పార్టీ ఎప్పుడో 2015లోనే ట్వీట్ చేసింది. అంటే ఇది నాలుగేళ్ల క్రితం నాటి ఫొటో అన్న మాట.
Snapshots from Rahul Gandhi's visit to flood affected areas of Tamil Nadu & Puducherry, yesterday (2/4) pic.twitter.com/kA4Qq320D9
— Congress (@INCIndia) December 9, 2015
2015 సంవత్సరంలో తమిళనాడు, పుదుచ్చేరి ప్రాంతాలలో తీవ్రంగా వరదలు వచ్చినపుడు వరద ప్రభావిత ప్రాంతాలలో రాహుల్ గాంధీ పర్యటించారు. అప్పుడు అక్కడి బాధితులను ఆయన ఓదార్చారు. అప్పుడే ఓ వృద్ధురాలు తమకు సాయం చేయాలంటూ ఆయన వద్దకు వచ్చారు. నాటి ఫొటో తీసుకుని చుట్టూ అంతా బ్లర్ చేసినా, పక్కనే ఉన్న మరో నాయకుడి ఫొటో తీసేసి, ఆయన చేతిని మాత్రం మర్చిపోయారు. దాన్నే న్యాయ్ పథకం కోసం వాడుకున్నారు. కాబట్టి పాత ఫొటోలు వాడుతుంటే కాస్తంత జాగ్రత్త పడాల్సిందే.
ఆల్ట్న్యూస్ సౌజన్యంతో