(న్యూస్ ఆర్బిట్ డెస్క్)
ఐసీస్ చీఫ్ అబూ బకర్ అల్ బాగ్దాదీ మరణించిన నేపథ్యంలో ఆ సంస్థ కొత్త చీఫ్ ని ప్రకటించింది. బాగ్దాదీ మరణం నిజమేనని, అమెరికా జరిపిన సైనిక చర్యలో ఆయన ప్రాణాలు కోల్పోయినట్టు వెల్లడించింది. ఐసీస్ కొత్త చీఫ్గా అబూ ఇబ్రహీం అల్ హష్మీ అల్ ఖురేషిని ఎంపిక చేసినట్లు ప్రకటించింది. ఈ మేరకు ఓ ఆడియోను విడుదల చేసింది. ఈ దాడుల్లో బాగ్దాదీతో పాటు అతని సన్నిహిత అనుచరుడు అబు హసన్ అల్ ముహాజిర్ కూడా మరణించాడని తెలిపింది. ”బాగ్దాదీ మరణంపై ఎక్కువ సంతోషించొద్దు.. ఐఎస్ కొత్త నాయకుడు అమెరికన్ దళాలతో పోరాడుతాడు” అని హెచ్చరించింది. దశాబ్ధం పాటు తమ సంస్థకు సేవలు అందించిన బాగ్దాదీ మరణం పట్ల విచారం వ్యక్తం చేసింది.
అమెరికా భద్రతా దళాలు జరిపిన దాడుల్లో ఐసిస్ ఉగ్రసంస్థ అధినేత అబూ బకర్ హతమైన విషయం తెలిసిందే. బాగ్దాదీ నివాస స్థావరంపై పక్కా సమాచారంతో అక్టోబర్ 27న అమెరికా సైన్యం బాంబుల వర్షం కురిపించింది. ఆమెరికా సైన్యానికి చెందిన ఓ జాగిలం కూడా బాగ్దాదీని వెంటాడి.. వేటాడింది. ఈ క్రమంలో కాంపౌండ్లో ఉన్న భూగర్భ సొరంగంలో తలదాచుకున్న బాగ్దాదీ.. అమెరికా సైనిక జవాన్లకు పట్టుబడకుండా ఉండేందుకు ఆత్మాహుతికి పాల్పడ్డాడు. ఈ ఘటనలో అతడి ఇద్దరు కుమారులు కూడా మృతి చెందారు.