అమరావతి: పోలవరం ప్రాజెక్టు పనుల విషయంలో ప్రభుత్వానికి అనుకూలంగా హైకోర్టు తీర్పు రావడంతో రివర్స్ టెండరింగ్లో బిడ్ కైవసం చేసుకున్న మేఘా ఇంజనీరింగ్ సంస్థకు ఆఘమేఘాల మీద పనులు అప్పగించింది. ఆ సంస్థ శుక్రవారం భూమి పూజ నిర్వహించుకునేందుకు అధికారులు రాత్రికి రాత్రే అన్ని పనులు పూర్తి చేసి వర్క్ ఆర్డర్ చేతిలో పెట్టారు.
పోలవరం జల విద్యుత్ కేంద్రం విషయంలో గతంలో ఇచ్చిన స్టేను హైకోర్టు ధర్మాసనం గురువారం ఎత్తివేసింది. థర్డ్ పార్టీకి పనులను అప్పగించకుండా ప్రభుత్వాన్ని ఆదేశించాలన్న అభ్యర్థనతో నవయుగ ఇంజనీరింగ్ కంపెనీ దాఖలు చేసిన పిటిషన్ను కోర్టు కొట్టివేసింది. ఈ నేపథ్యంలో జలవనరుల శాఖ అధికారులు ఆఘమేఘాల మీద మేఘా ఇంజనీరింగ్ సంస్థకు వర్క్ ఆర్డర్ ఇవ్వడంతో శుక్రవారం భూమి పూజ కార్యక్రమాన్ని సైతం పూర్తి చేశారు.
అయితే నవయుగ బాధితులు, పలువురు సబ్ కాంట్రాక్టర్లు తమకు రావాల్సిన బకాయిలపై హామీ ఇచ్చిన తరువాతే సైట్లోకి వెళ్లాలంటూ మేఘా సిబ్బందిని తొలుత అడ్డుకున్నారు. ఈ నేపథ్యంలో ఆందోళన చేస్తున్న వారిని పోలీసులు పక్కకు నెట్టేసి మేఘా అధికారులు, యంత్ర సామాగ్రి, సిబ్బందిని ప్రాజెక్టు వద్దకు తీసుకువెళ్లారు.
ప్రాజెక్టు స్పిల్వే బ్లాక్ నెం.18 వద్ద జలవనరుల శాఖ ఇఇ ఏసుబాబు సమక్షంలో మేఘా ఇంజనీరింగ్ సంస్థ డిజిఎం సతీష్, వెంకట సతీష్, మేనేజర్ మురళి భూమిపూజ నిర్వహించారు. జలవనరుల శాఖ అధికారులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
నవంబర్ ఒకటవ తేదీ నుండి పోలవరం ప్రాజెక్టు పనులు ప్రారంభించాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డి ఇంతకు ముందే వెల్లడించి ఉన్నారు. పోలవరం ప్రాజెక్టు పనుల విషయంలో రివర్స్ టెండరింగ్కు వెళ్లవద్దని కేంద్ర మంత్రి సూచించిన విషయం తెలిసిందే. రివర్స్ టెండరింగ్కు వెళితే ప్రాజెక్టు పనుల జాప్యంతో ఖర్చు పెరుగుతుందని కూడా కేంద్ర మంత్రి సూచన చేశారు. అయినప్పటికీ జగన్మోహనరెడ్డి ప్రభుత్వం రివర్స్ టెండరింగ్ ప్రక్రియను సమర్థవంతంగా పూర్తి చేసింది. రివర్స్ టెండరింగ్ ద్వారా ప్రభుత్వానికి దాదాపు 750 కోట్ల రూపాయలు ఆదా అయినట్లుగా కూడా ప్రకటించింది. కోర్టు అడ్డంకులు సైతం తొలగిపోవడంతో మేఘా ఇంజనీరింగ్ సంస్థతో పనుల నిర్వహణకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది.
ప్రాజెక్టు పనులను మేఘా సంస్థకు అప్పగిస్తూ రెండేళ్లలో పనులు పూర్తి చేయాలని ప్రభుత్వం ఒప్పందం చేసుకున్నది.