హైదరాబాద్: భార్య పళ్లు ఎత్తుగా ఉన్నాయన్న వంకతో ఓ భర్త ట్రిపుల్ తలాక్ చెప్పాడు. ఈ ఘటన హైదరాబాద్ లో చోటుచేసుకుంది. మూడు నెలల క్రితం 2019 జూన్ 27న కుషాయిగూడకు చెందిన ముస్తఫాతో రుక్సానా బేగం పెళ్లి జరిగింది. కొంత కాలం ఇద్దరూ బాగానే ఉన్నారు. కానీ తర్వాత ముస్తఫాలో మార్పు వచ్చింది. నీతో కలిసి జీవించలేను అంటూ ఆమెకు తలాక్ చెప్పాడు. ఈ చర్యతో కంగుతిన్న రుక్సానా ఎందుకు విడాకులు ఇవ్వాలనుకుంటున్నావో చెప్పాలంటూ నిలదీసింది. దీనికి అతడు పళ్లు ఎత్తుగా ఉన్నాయని అందుకే తలాక్ ఇస్తున్నానని చెప్పాడు. దీంతో బాధితురాలు పోలీసులను ఆశ్రయించింది. చాలా రోజులుగా తన భర్త, అత్తింటివాళ్లు అదనపు కట్నం కోసం వేధిస్తున్నారని బాధితురాలు ఆరోపిస్తోంది. అందుకే పళ్లు ఎత్తుగా ఉన్నాయనే సాకు చూపిస్తున్నారంటూ ఆవేదన వ్యక్తం చేసింది. తమ వివాహ సమయంలో ముస్తఫా, అతని కుటుంబం పలు విషాయాల్లో డిమాండ్స్ చేశారనీ..వాటిన్నింటినీ తమ కుటుంబం నెరవేర్చిందనీ..కానీ వివాహం తరువాత కూడా తనను అధికంగా డబ్బు..బంగారం తేవాలనీ.. ఒత్తిడిచేస్తూ వేధిస్తున్నారని వాపోయింది. రుక్సానా ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకున్న కుషాయిగూడ పోలీసులు దర్యాప్తు చేపట్టారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు సెక్షన్ 498ఏ కింద ముస్తఫాపై పోలీసులు కేసు నమోదు చేసి విచారిస్తున్నారు.
‘వివాహ సమయంలో ముస్తఫా, అతని కుటుంబం భారీగా కట్న కానుకలు తీసుకున్నారు. పెళ్లి తర్వాత నుంచి వేధింపులు మొదలయ్యాయి. అదనపు కట్నం తీసుకురావాల్సిందిగా రోజూ హింసించడం మొదలుపెట్టారు. చివరగా ఓరోజు ముస్తఫా నాతో ఉండటం ఇష్టం లేదని చెప్పాడు. నా పళ్లు ఎత్తుగా ఉన్న కారణంగా కలిసి ఉండలేనన్నాడు. మా అత్తింటివారు కూడా అతనికే మద్దతు తెలిపారు. 10-15 రోజులు నన్ను ఇంట్లోనే ఓ గదిలో బంధించారు ’ అని రుక్సానా తెలిపింది. తాను పోలీసులను ఆశ్రయించడంతో అత్తింటివారు,భర్త వచ్చి మొదట రాజీకి వచ్చారని.. తిరిగి తీసుకెళ్తామని చెప్పారని రుక్సానా పేర్కొంది. కానీ ఆ తర్వాత మళ్లీ ముస్తఫా మాట మార్చాడని.. తన తల్లిదండ్రులపై దుర్భాషలాడి,తనకు ట్రిపుల్ తలాక్ చెప్పాడని ఆవేదన వ్యక్తం చేసింది. దీంతో మరోసారి పోలీసులను ఆశ్రయించి కేసు పెట్టినట్టు వివరించింది. తనకు న్యాయం చేయాలని కోరింది.
కేంద్ర ప్రభుత్వం ముస్లిం మహిళల వివాహ హక్కుల రక్షణ చట్టం-2019 అమలులోకి తీసుకొచ్చినా..ట్రిపుల్ తలాక్ కేసులకు ఫుల్ స్టాప్ పడకపోవడం గమనార్హం. కేంద్రం కొద్ది నెలల క్రితమే ట్రిపుల్ తలాక్పై చట్టం తెచ్చింది. ఇకపై ఎవరైనా తలాక్ చెబితే కేసు నమోదు చేస్తారు.. మూడేళ్ల పాటు జైలు శిక్ష విధిస్తారు. ఈ చట్టం వచ్చిన తర్వాత కూడా దేశవ్యాప్తంగా అక్కడక్కడా తలాక్ కేసులు నమోదవుతూనే ఉన్నాయి.