న్యూఢిల్లీ: ఈసారి లోక్సభ ఎన్నికలపై గతంలో ఎప్పుడూ లేనంత ఆసక్తి అన్నివర్గాలలో కనిపిస్తోంది. 2014 ఎన్నికల్లో సోషల్ మీడియాను ఆయుధంగా చేసుకుని చాలామంది ఓటర్లను నాయకులు ప్రభావితం చేయగలిగారు. దాన్ని గుర్తించి ఇప్పటికే యూట్యూబ్ చానళ్లలో కుప్పలకొద్దీ వీడియోలు పోస్ట్ అవుతున్నాయి. అవి ట్విట్టర్, వాట్సాప్, ఫేస్బుక్ లాంటి సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. దీంతో ఎన్నికల కమిషన్ కూడా జాగ్రత్త పడుతోంది. దీనిపై డేగకన్ను వేసి ఉంచుతోంది. లోక్సభ ఎన్నికలకు నామినేషన్ దాఖలు చేసేటపుడు సోషల్ మీడియా వివరాలు కూడా ఇవ్వాలని చెబుతోంది. ప్రచారం పక్కదోవ పట్టకుండా ఉండేందుకు తగిన పర్యవేక్షణ వ్యవస్థ ఏర్పాటు చేస్తామని ట్విట్టర్, గూగుల్, ఫేస్బుక్ లాంటివి రాతపూర్వకంగా ఇవ్వాలని స్పష్టం చేస్తోంది. అంటే, సోషల్ మీడియాపై కూడా ఈసీ డేగకన్ను ఈసారి ఉండబోతోందన్నమాట. తప్పుడువార్తల నిరోధానికి సోషల్ మీడియా ప్లాట్ఫారాలు చర్యలు తీసుకోవాలని సీఈసీ సునీల్అరోరా తెలిపారు. ఆయా ప్లాట్ఫారాలలో ప్రచురితమయ్యే కంటెంటుపై తగిన చర్యలు వెంటనే తీసుకోడానికి ‘గ్రీవెన్స్ ఆఫీసర్లు’ ఉండాలని సూచించారు.
చర్యలు తప్పనిసరి
ఎన్నికల సంఘంలోని అధికారులు ఏదైనా కంటెంటుపై ఫిర్యాదుచేస్తే, సోషల్ మీడియా ప్లాట్ఫారాలు చర్యలు తీసుకోవాల్సి ఉంటుంది. ఈసీతో కలిసి ఇంటర్నెట్ అండ్ మొబైల్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా కూడా నీతిసూత్రాలు సిద్ధం చేస్తోందని అరోరా చెప్పారు. ఈ పని కొనసాగుతోందని తెలిపారు. సోషల్ మీడియాలో పెట్టే రాజకీయ ప్రకటనలన్నింటికీ ముందస్తు సర్టిఫికేషన్ ఇక తప్పనిసరి. వివిధ పార్టీలు ఇచ్చే ప్రకటనలను ముందే తనిఖీ చేసుకోవాలని గూగుల్, ఫేస్బుక్, ట్విట్టర్, యూట్యూబ్ లకు చెప్పారు. సోషల్ మీడియాలో ఇచ్చే ప్రకటనల ఖర్చును కూడా ఎన్నికల ఖర్చులోనే కలుపుతామని సీఈసీ హెచ్చరించారు.
ఏడు దశల్లో ఎన్నికలు
ఏప్రిల్ 11 నుంచి మే 19 వరకు ఏడు దశల్లో ఎన్నికలు జరగనున్నాయి. ఏపీ సహా నాలుగు రాష్ట్రాల అసెంబ్లీలకు, లోక్సభకు ఈ ఎన్నికలుంటాయి. మే 23వ తేదీన ఫలితాలు వెల్లడవుతాయి. ఎన్నికల కోడ్ ఇప్పటికే అమలులోకి వచ్చింది. ఈసారి నుంచి ఇది సోషల్ మీడియాకు కూడా అమలవ్వడం సరికొత్త విశేషం.
వాట్సాప్ సంగతేంటి?
కొత్త నిబంధనలు కొంతవరకు బాగానే ఉన్నా, వాటిలోనూ లోటుపాట్లున్నాయి. ఉదాహరణకు సోషల్ మీడియా అంటే అన్నీ చెప్పారు గానీ వాట్సాప్ సంగతి ప్రస్తావించలేదు. నిజానికి చాలావరకు ఫేక్న్యూస్ ప్రచారం అయ్యేది, వైరల్ అయ్యేది వాట్సాప్ లోనే. కానీ పూర్తిగా ఎన్క్రిప్ట్ అయి ఉండే ఈ సందేశాలను పర్యవేక్షించడం సాధ్యం కాదు. గూగుల్, ఫేస్బుక్ లాంటివాటిని కూడా ఎలా పర్యవేక్షించి, ఏం చర్యలు తీసుకుంటారని చాలామంది విలేకరులు అరోరాను అడిగారు కూడా.