అమరావతి, మార్చి 11: కేంద్ర ఎన్నికల సంఘం సార్వత్రిక ఎన్నికల షెడ్యూల్ వెల్లడించడంతో ప్రధాన పార్టీలు అసెంబ్లీ, పార్లమెంట్ అభ్యర్థుల ఖరారుపై వేగం పెంచారు. ఇప్పటికే తెలుగుదేశం పార్టీ, వైసిపి, జనసేన పార్టీలు పలు అసెంబ్లీ, పార్లమెంట్ స్థానాల అభ్యర్థుల ఎంపికపై కసరత్తు పూర్తి చేసినా అధికారికంగా తొలి జాబితా విడుదల చేయలేదు.
జనసేన పార్టీ కేవలం వామపక్షాల పొత్తుతోనే 175 అసెంబ్లీ, 25 పార్లమెంట్ స్థానాలకు పోటీ చేస్తామని ప్రకటించి ఉంది. నేటి సాయంత్రానికి సుమరు 40 అసెంబ్లీ స్థానాలకు అభ్యర్థులను ఖరారు చేసి జనసేనాని పవన్ కళ్యాణ్ తొలి జాబితా విడుదల చేస్తారని ఆ పార్టీ వర్గాలు వెల్లడించాయి.
జనసేన అధినేత పవన్ కళ్యణ్ ఇప్పటికే రాష్ట్రంలోని పలు నియోజకవర్గాల్లో విద్యార్థులతో ముఖాముఖి, పార్టీ క్యాడర్తో సమావేశాలు, మేధావులతో చర్చలతో పాటు రోడ్ షోలు నిర్వహించారు. రాష్ట్రం అభివృద్ధి చెందాలన్నా, ప్రజల జీవితాల్లో వెలుగు రావాలన్నా ప్రస్తుతం ఉన్న రాజకీయ వ్యవస్థలో సమూలమైన మార్పు రావాలని ప్రజానీకానికి, యువత, మహిళలను చైతన్య పరుస్తూ ప్రసంగాలు చేశారు.
జనసేన అభ్యర్థిత్వాల కోసం వివిధ వర్గాల నుండి స్క్రీనింగ్ కమిటి ముందుకు వచ్చిన ధరఖాస్తులను పరిశీలించి జనరల్ బాడీకి అందజేశారని ఆ పార్టీ నేతలు తెలియజేశారు. అదివారం అభ్యర్థిత్వాల ఖరారుపై ముఖ్యనేతలతో పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ సమావేశం నిర్వహించారు.
నేటి సాయంత్రం సుమారు 40మంది అభ్యర్థులతో తొలి జాబితా విడుదలకు సన్నాహాలు చేస్తున్నట్లు ఆ పార్టీ వర్గాలు తెలియజేశాయి.