(న్యూస్ ఆర్బిట్ డెస్క్)
జార్ఖండ్ ఎన్నికల ఫలితాలు ఉత్కంఠ రేపుతున్నాయి. సోమవారం ఉదయమే కౌంటింగ్ ప్రారంభం కాగా…ప్రస్తుతం బీజేపీ, కాంగ్రెస్-జేఎంఎం కూటమీ నువ్వా నేనా అన్నట్లు పోటీ పడుతున్నాయి. బీజేపీ 34 స్థానాల్లో, జేఎంఎం 35 స్థానాల్లో ఆధిక్యత కొనసాగిస్తున్నాయి. జేవీఎం 3, ఏజేఎన్ 5, ఇతరులు ఒక స్థానంలో ఆధిక్యంలో కొనసాగుతున్నారు.
జార్ఖండ్ ఎగ్జిట్ పోల్స్ ఫలితాలతో ఇప్పుడు దేశమంతా ఉత్కంఠగా ఈ ఫలితాల కోసం ఎదురు చూస్తోంది. రాష్ట్రంలో మరోసారి బీజేపీ అధికారం చేపడుతుందా? లేక ప్రజలు ఈసారి కాంగ్రెస్ కూటమికి అవకాశం ఇస్తారా? అనేది మరికొన్ని గంటల్లో తేలిపోనుంది. రాష్ట్రంలోని మొత్తం 81 స్థానాలకు ఐదు దశల్లో పోలింగ్ జరగ్గా.. అన్ని పార్టీలు హోరాహోరీ తలపడ్డాయి. బీజేపీ మరోసారి అధికారాన్ని దక్కించుకునేందుకు ఒంటరిగా బరిలోకి దిగగా.. కాంగ్రెస్ పార్టీ జేఎంఎం, ఆర్జేడీలతో కలిసి కూటమిగా పోటీ చేసింది. జేఎంఎం 43 స్థానాల్లో, కాంగ్రెస్ 31, ఆర్జేడీ 7 స్థానాల్లో పోటీ చేశాయి.
ఇటీవల విడుదలైన ఎగ్జిట్ పోల్ ఫలితాలు.. బీజేపీకి షాకిచ్చాయి. కాంగ్రెస్ కూటమికే అధికారం దక్కుతుందని స్పష్టం చేశాయి. దాదాపుగా సర్వేలన్నీ బీజేపీకి 22 నుంచి 30 స్థానాలు రావొచ్చని.. కాంగ్రెస్-జెఎంఎం కూటమి 50 స్థానాలు గెలిచే అవకాశముందని ప్రకటించాయి. మరోసారి అధికారం నిలబెట్టుకోవడం కష్టమేనని తేల్చాయి. కాంగ్రెస్-జేఎంఎం కూటమి స్వల్ప మెజార్టీ సాధించే అవకాశం ఉందని సర్వేలు చెబుతున్నాయి. అదే సమయంలో హంగ్ ఏర్పడే అవకాశం ఉందని పేర్కొన్నాయి. దీంతో జార్ఖండ్ ఎన్నికల ఫలితాలు మరింత ఆసక్తికరంగా మారాయి.
మొత్తం 81 స్థానాలున్న జార్ఖండ్లో అధికారం చేపట్టాలంటే మ్యాజిక్ ఫిగర్ 42 సాధించాలి. రాష్ట్రంలోని 81 అసెంబ్లీ స్థానాలకుగానూ నవంబర్ 30 నుంచి డిసెంబర్ 20 వరకు ఐదు విడతల్లో ఎన్నికలు జరిగాయి. సమారు 65.17 శాతం ఓటింగ్ నమోదైంది. 2014 ఎన్నికల్లో 66.03 శాతం పోలింగ్ తో పోలిస్తే ఈసారి స్వల్పంగా ఓటింగ్ శాతం తగ్గింది. 2000లో బిహార్ నుంచి విడిపోయి ప్రత్యేక రాష్ట్రంగా అవతరించిన తరువాత జార్ఖండ్ లో అసెంబ్లీ ఎన్నికలు జరగడం ఇది నాలుగోసారి.
ఇటీవల రెండు రాష్ట్రాల్లో జరిగిన ఎన్నికల్లో అధికార బీజేపీకి ప్రజలు షాక్ ఇచ్చారు. హర్యానాలో బీజేపీ, జేజేపీ కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయగా.. మహారాష్ట్రలో అధికారానికి దూరమైంది. ఎగ్జిట్ పోల్ ఫలితాలు చెబుతున్నట్టుగా జార్ఖండ్ ఎన్నిల్లో సైతం అలాంటి సీనే రిపీటవుతుందా ? అనేది ఉత్కంఠగా మారింది.