అమరావతి: మూడు రాజధానుల ప్రకటపై అమరావతిలో రైతుల ఆందోళన ఉధృతం చేశారు. రాజధాని పరిధిలోని 29 గ్రామాల్లో నిరసనలు, రిలే దీక్షలు కొనసాగుతున్నాయి. రైతులు, మహిళలు, యువత, పిల్లలు రోడ్లపైకి వచ్చి తమ నిరసనలు తెలియజేస్తున్నారు. సోమవారం ఉదయం తుళ్లూరులో మహా ధర్నాకు పిలుపునిచ్చారు. ధర్నా కోసం రైతులు వేసిన టెంట్లను పోలీసులు తొలగించేశారు. దీంతో పోలీసులతో రైతులు వాగ్వాదానికి దిగడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. దీంతో రైతులు మందడం రోడ్డుపే ధర్నా నిర్వహించేందుకు సిద్ధమయ్యారు. సచివాలయానికి వెళ్లే మార్గం కావడంతో ఉద్యోగులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా పోలీసులు భారీగా మోహరించారు. రోడ్డుపై బైఠాయించొద్దని రైతుల్ని కోరారు. అమరావతి ప్రాంతంలో రైతుల నిరసనలు, ధర్నాలతో హోరెత్తడంతో పోలీసులు ముందుగానే అప్రమత్తమయ్యారు. ముందస్తు జాగ్రత్త చర్యల్లో భాగంగా రాజధాని ప్రాంతంలోని 29 గ్రామాల్లో బలగాలను మోహరించారు. రైతులు ఆందోళనలు చేపట్టే ప్రాంతంలో పోలీసులతో నిఘా పెంచారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు.
ఇదిలా ఉంటే.. రాజధాని ప్రాంతంలోని 29 గ్రామాల్లో పోలీస్ పికెటింగ్ ఏర్పాటు చేశారు. సచివాలయం రహదారి వద్ద పోలీసు నిఘాను మరింత పెంచారు. సచివాలయం మార్గంలో వెళ్లే వాహనదారులను ఆపి తనిఖీలు చేస్తున్నారు. గుర్తింపు కార్డుల్ని పరిశీలించి పంపిస్తున్నారు. ఆ మార్గం వైపు వెళ్లే ప్రతి వాహనం నంబర్ను నమోదు చేస్తున్నారు. ఆధార్ కార్డుల్లో అడ్రస్సుల్ని క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. అయితే పోలీసుల తీరుపై రైతులు మండిపడుతున్నారు.. ఆధార్ కార్డులు అడిగటం ఏంటని ప్రశ్నిస్తున్నారు.
మరోవైపు రాజధాని రైతులు చేపట్టిన నిరసనలకు మద్దతుగా గుంటూరులోనూ పలువురు ఆందోళనలు చేపట్టారు. మహిళలు, వృద్ధులు ఈ నిరసనలో పాల్గొన్నారు. రాజధాని అమరావతిలోనే కొనసాగించాలని, రాజధాని ప్రాంత ఎమ్మెల్యేలు, ఎంపీలు రాజీనామా చేయాలని వారు డిమాండ్ చేస్తున్నారు.