ఒకే దేశం.. ఒకే టారిఫ్. ఒకే వ్యవస్థ పేరుతో ఏకీకృత విధానం తీసుకొచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రవేశ పెడుతున్న విద్యుత్ సవరణ చట్టం 2020 వల్ల రాష్ట్ర ప్రభుత్వాలకు ‘పవర్’ కట్ అవుతుందా?, వినియోగదారులపై పెను భారం పడనున్నదా? అంటే అవుననే సమాధానం వస్తుంది. కేంద్ర ప్రభుత్వ సూచనలు పక్కన పెట్టి రాష్ట్రాలలో పవర్ పర్చేజ్ అగ్రిమెంట్లను (పిపిఏ) నూతనంగా ఏర్పడిన ప్రభుత్వాలు సమీక్షించడం వల్లనే కేంద్రం ఈ చట్టాన్ని తీసుకురావడానికి కారణం అని కూడా భావిస్తున్నారు.
వ్యతిరేకిస్తున్న ముఖ్యమంత్రులు
కేంద్ర ప్రభుత్వం తీసుకొని వస్తున్న ఈ చట్టాన్ని తెలంగాణా ముఖ్యమంత్రి కేసీఆర్ తో సహా పలు రాష్ట్రాల ముఖ్యమంత్రులు వ్యతిరేకిస్తున్నారు. ప్రధానంగా ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే ఈ బిల్లు చట్టం అయితే రాష్ట్రాలకు విద్యుత్ శక్తిపై ఏ అధికారం ఉండదు. ఇప్పటి వరకు అనేక రాష్ట్రాలు వ్యవసాయ రంగానికి, ఎస్ సి, ఎస్ టి వర్గాలకు ఉచిత విద్యుత్, సబ్సిడీలు అందిస్తున్నది. ఈ రంగం పూర్తి స్థాయిలో కేంద్ర ప్రభుత్వ అధీనంలోకి వెలితే రాష్ట్రాలకు ఇబ్బందికర పరిస్థితే.
జాతీయ స్థాయిలోనే కమిటీ
జాతీయ స్థాయిలో సుప్రీంకోర్టు రిటైర్డ్ ప్రధాన న్యాయమూర్తి చైర్మన్ గా, కొందరు విద్యుత్ రంగ నిపుణులతో కేంద్రం కమిటీని వేస్తుంది. ఈ కమిటీ రాష్ట్రాల ఈఆర్సీ చైర్మన్ లను, సభ్యుల పేర్లను సిఫార్సు చేస్తే, కేంద్రం నియమిస్తుంది. పారిశ్రామిక రాయితీలు, ఎస్సీ, ఎస్టీల గృహాలకు ఉచిత విద్యుత్ రాయితీలను రాష్ట్ర ప్రభుత్వమే భరించాలి అని చట్టంలో ఉన్నట్లు సమాచారం. ఈ చర్యలతో డిస్కమ్ లు బలపడతాయని కేంద్రం భావిస్తోంది.
పిపిఏల పునః సమీక్షకు ఆస్కారం నిల్
కాంట్రాక్టు ఎన్ ఫోర్స్ మెంట్ అథారిటీని ఏర్పాటు చేయాలని కేంద్రం నిర్ణయించింది. ఈ అథారిటీ ఏర్పడితే రాష్ట్రాలు పీపీఏలను పునః సమీక్షించేందుకు ఆస్కారం ఉండదు. కేంద్ర విద్యుత్ చట్టం 2003కు పలు సవరణలను ప్రతిపాదిస్తూ రూపొందించిన విద్యుత్ చట్టం సవరణల ముసాయిదా బిల్లు-2020 పై జూన్ ఎనిమిదవ తేదీలోగా రాష్ట్ర ప్రభుత్వాలు అభ్యంతరాలు, సలహాలు సూచనలు తెలియజేయాల్సిఉంది.
రాష్ట్ర అధికారాలకు కత్తెర
కేంద్రం తీసుకువచ్చే విద్యుత్ చట్ట సవరణ ముసాయిదా బిల్లు ద్వారా రాష్ట్రాల అధికారాలకు చెక్ పడనుంది. ఈఆర్సీ చైర్మెన్, సభ్యుల నియామకం విషయంలో రాష్ట్రాల అధికారం పోతుంది. పీపీఏల అమలును పర్యవేక్షించేందుకు ఎలక్ట్రిసిటీ కాంట్రాక్ట్ ఎన్ఫోర్స్మెంట్ ఆథారిటీ పేరుతో కొత్త సంస్థను ఏర్పాటు చేయాలని కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదించింది. పునరుత్పాదక ఇంధనం కొనకుంటే జరిమానా, ఈఆర్సీ నిర్దేశించిన మొత్తంలో ప్రతి సంవత్సరం డిస్కంలు పునరుత్పాదక విద్యుత్ను కొనుగోలు చేయాల్సిందేనని కేంద్రం చేబుతోంది. నిర్దేశించిన పరిమాణం కన్నా తక్కువగా కొనుగోలు చేసిన విద్యుత్కు సంబంధించిన ప్రతి యూనిట్కు 50పైసలు చొప్పున డిస్కంలు జరిమానాలు చెల్లించాల్సి ఉంటుంది. ఇప్పటికే తీవ్ర నష్టాల్లో ఉన్న డిస్కంలకు ఈ నిబంధన పెను భారంగా మారే ప్రమాదముంది. విద్యుత్ సరఫరాకు డిస్కంలు చేస్తున్న మొత్తం ఖర్చులను రాబట్టుకునేలా విద్యుత్ టారీఫ్ ఉండాల్సిందేనని విద్యుత్ చట్ట సవరణ బిల్లులో ఉంది. సబ్సిడీని డైరెక్ట్ గా వినియోగదారులకు గ్యాస్ సబ్సిడీ తరహాలో బదిలీ చేయనున్నారు. ఇప్పుడు గృహ వినియోగదారులకు 1.45 పైసలు నుంచి 4.50 రూపాయల వరకు వినియోగం ఆధారంగా సబ్సిడీతో బిల్లులు వేస్తున్నారు. ఇకపై పూర్తి బిల్లు చెల్లించాల్సి ఉంటుంది. సుమారు ఏడు రూపాయల వరకు యూనిట్ ధర పెరగనుంది. ఈ బిల్లుపై ఏపి ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఇంతవరకు స్పందించలేదు. తెలంగాణ సీఎం కేసీఆర్ మాత్రం తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. విద్యుత్ సవరణ బిల్లును గట్టిగా పార్లమెంట్ లో వ్యతిరేకిస్తామని ఆయన అంటున్నారు. విద్యుత్ చట్ట సవరణ ముసాయిదా బిల్లుపై కేంద్రం, రాష్ట్రాల మధ్య వివాదాలు తప్పవనీ, ఇది భారత దేశ ఫెడరల్ స్ఫూర్తికి విరుద్ధమైనదని పలువురు మేధావులు పేర్కొంటున్నారు.