కఠ్మాండు: హిమాలయ పర్వతాల్లోని ఎవరెస్టు శిఖరం అత్యంత ఎత్తయినది కావడంతో ప్రతి ఒక్కరూ దాన్ని అధిరోహించాలని అనుకుంటారు. కానీ, పర్వతారోహణలో కనీస నైపుణ్యాలు లేనివారు కూడా వచ్చేస్తుండటంతో అక్కడ విపరీతంగా ‘ట్రాఫిక్ జామ్’ అవుతోంది. ఈ సీజనులో నేపాల్ ఇంతకుముందెన్నడూ లేనంతగా రికార్డు స్థాయిలో 381 మందికి ఎవరెస్ట్ ఎక్కేందుకు అనుమతులు ఇచ్చింది. వారిలో చాలామందికి సరైన శిక్షణ లేనే లేదు. దానివల్ల తమతో పాటు షేర్పాల ప్రాణాలను కూడా వాళ్లు ప్రమాదంలోకి నెడుతున్నారు. ఇలాంటి ‘ట్రాఫిక్ జామ్’లో ఇరుక్కుని, ఎలాగోలా ప్రాణాలు దక్కించుకున్న భారతీయ పర్వతారోహకురాలు అమీషా చౌహాన్ ప్రస్తుతం ‘ఫ్రాస్ట్ బైట్’కు గురై.. ఆసుపత్రిలో కోలుకుంటున్నారు. ఈ ఏడాది ఎదురైన దారుణ పరిస్థితులు మళ్లీ రాకూడదంటే, ఇలా నైపుణ్యం లేనివాళ్లను పక్కన పెట్టాలని ఆమె సూచించారు. ఇప్పటివరకు రెండు వారాల్లో పది మంది వరకు మరణించారు. వాతావరణం అంతగా సహకరించకపోవడంతో పర్వతారోహకులు పెద్ద పెద్ద క్యూలైన్లలో వేచి ఉండాల్సి వస్తోంది. దాంతో వాళ్లకు విసుగుతో పాటు ఆక్సిజన్ అయిపోయే ప్రమాదం కూడా ఉంటోంది.
8,848 మీటర్ల ఎత్తున్న ఎవరెస్ట్ శిఖరం నుంచి కిందకు రావడానికి తాను 20 నిమిషాల పాటు ఒక్కచోటే వేచి ఉండాల్సి వచ్చిందని, కానీ మిగిలినవాళ్లు గంటల తరబడి అక్కడే ఉండిపోయారని అమీషా చెప్పారు. కొంతమందికి అసలు ప్రాథమిక విషయాలు కూడా తెలియక పూర్తిగా షేర్పాల మీదే ఆధారపడ్డారని, ప్రభుత్వం ఈ శిఖరం ఎక్కేందుకు కొన్ని ప్రమాణాలు నిర్ణయించాలని ఆమె అన్నారు. ప్రస్తుతం కఠ్మాండు లోని ప్రభుత్వాసుపత్రిలో ఆమె చికిత్స పొందుతున్నారు. మంచు కారణంగా ఆమె ఎడమకాలి వేళ్లన్నీ నల్లగా అయిపోయాయి. ముఖం కూడా బాగా పాడైంది. శిక్షణ పొందినవాళ్లకే ఎవరెస్ట్ ఎక్కే అవకాశం ఇవ్వాలని ఆమె అన్నారు.
ఎవరెస్టుతోపాటు ఇతర హిమాలయ శిఖరాల మీద కూడా తొమ్మిది మంది మరణించగా, మరొకరి ఆచూకీ తెలియడం లేదు. ఎవరెస్ట్ మీద అత్యంత ప్రమాదకరమైన ‘డెత్ జోన్’లో గంటల తరబడి వేచి ఉండాల్సి రావడం వల్లే కనీసం నలుగురు మరణించినట్లు చెబుతున్నారు. అక్కడ గాలి చాలా తక్కువగా ఉంటుందని, మంచు దట్టంగా ఉంటుందని అంటున్నారు. 2014-15 తర్వాత ఎక్కువమంది ఈసారే మరణించారు. అప్పట్లో భూకంపాల వల్ల మంచు కొండలు విరిగిపడటంతో పలువురు ప్రాణాలు కోల్పోయారు. ఎవరెస్టు మీద ఎంత పెద్ద పెద్ద క్యూలైన్లు ఉంటున్నాయో అన్న విషయాన్ని నిర్మల్ పుర్జా అనే మాజీ గూర్ఖా సైనికుడు ఫొటో తీసి చూపించారు. ఎవరెస్ట్ ఎక్కాలన్న ఉత్సాహం ఎంత ప్రమాదకరంగా పరిణమిస్తోందో ఈ ఫొటోయే చూపిస్తుంది.
చాలామందికి ఆక్సిజన్ అయిపోయవచ్చిందని చౌహాన్ తెలిపారు. కొంతమంది కేవలం నిర్లక్ష్యం వల్లే మరణించారని, వాళ్లు ఒకవైపు ఆక్సిజన్ అయిపోతున్నా పైకి వెళ్లాలని పట్టుబట్టారని, దానివల్ల ప్రాణాలకే ప్రమాదం వచ్చిందని చెప్పారు. సాహస సినిమాలు తీసే ఎలియా సైకలీ కూడా ఇన్ స్టాగ్రామ్ లో ఈ చిత్రాలను పోస్ట్ చేశారు. అక్కడ ఉన్నదాన్ని తానే నమ్మలేకపోతున్నానన్నారు. మార్గమధ్యంలో ఎటు చూసినా శవాలు, మరణాలు కనిపిస్తున్నాయని, క్యాంపు 4లో టెంటుల్లో కూడా శవాలున్నాయని సైకలీ అన్నారు. తిరిగి వద్దామనుకునేవాళ్లు చివరకు మరణించారని, జనాలు వాళ్ల శవాల మీదుగా నడిచి వెళ్తున్నారని చెప్పారు.