(న్యూస్ ఆర్బిట్ బ్యూరో)
అమరావతి: రాష్ట్రంలో కోటి మంది పేద వర్గాలకు ఈ ఉగాది నాడు ఇళ్ల పట్టాలు పంపిణి చేయాలని ప్రభుత్వం కృత నిచ్ఛయంతో ఉంది. ఈ ప్రయత్నాలకు రాజధాని గ్రామాల్లో మాత్రం ఒకింత అడ్డంకులు వస్తున్నాయి. ఇది ఉద్దేశ పూర్వకమా?? టీడీపీ చేస్తున్న పనా…? అనేది పక్కన పెడితే ఏకంగా 426 మంది రైతులపై కేసులు నమోదు కావడం చర్చనీయాంశంగా మారింది. ఇది కచ్చితంగా రాజకీయ వ్యవహారమే. కానీ కేసుల్లో ఇరుక్కున్న రైతులు ఎలా స్పందిస్తారనేది ప్రశ్నర్ధకం. భూసేకరణ ప్రక్రియ ను అడ్డుకునే ప్రయత్నాలు ఎక్కడున్నా సరే వాటిని సమర్ధవంతంగా తిప్పి కొట్టాలని ప్రభుత్వం భావిస్తోంది.
మొన్న కొత్తూరు తాడేపల్లిలో తహసీల్దార్ వనజాక్షిఫై దాడికి పాల్పడిన ఓ మాజీ మంత్రి అనుచరుడితో సహా సుమారు 35 మందిపై కేసు నమోదు చేయగా, నిన్న కృష్ణాయపాలెంకు చెందిన 426మంది రైతులపై ఏడు సెక్షన్ ల కింద కేసులు నమోదు అయ్యాయి.
ఓ పక్క అమరావతి నుండి రాజధాని తరలించడానికి వీలు లేదంటూ ఆ ప్రాంతంలోని రైతులు ఆందోళనలు చేస్తున్న తరుణంలో పెద్ద సంఖ్యలో రైతులపై కేసులు నమోదు కావడం తీవ్ర చర్చనీయాంశమవుతోంది. విధి నిర్వహణలో అధికారులను అడ్డగించడాన్ని ప్రభుత్వం తీవ్రంగా పరిగణిస్తుంది. ఈ ఘటనపై వివరాలను పరిశీలిస్తే… రెండు రోజుల క్రితం విజయవాడ రూరల్ మండల తహసీల్దార్ వనజాక్షి పేదల ఇళ్ల స్థలాల కోసం భూములు కొనుగోలు చేసేందుకు కొత్తూరు తాడేపల్లి లో గ్రామ సభ నిర్వహించారు. ఈ సందర్బంగా తహసీల్దార్ వనజాక్షి మాట్లాడుతూ “తమకు రెండు లక్షలు ఇస్తే ఎకరాకు 50లక్షలు పరిహారాన్ని ప్రభుత్వం నుండి ఇప్పిస్తామని కొందరు దళారీలు ప్రచారం చేస్తున్నట్లు తమదృష్టికి వచ్చిందని, అటువంటి వార్తలు నమ్మవద్దని, ముందుగా అలాంటి బ్రోకర్ లు ఎవరైనా ఉంటే గ్రామ సభ నుండి బయటకు వెళ్లాలని” సూచించారు. ప్రభుత్వ నిర్ణయం ప్రకారం పట్టా భూములు ఎకరానికి 40లక్షల రూపాయలు, అసైన్డ్ భూములకు ఎకరాకు 30లక్షల రూపాయలు, పీఓటీ భూములకు ఎకరాకు 25లక్షల రూపాయలు చొప్పున చెల్లించడం జరుగుతుందని తెలిపారు… ఇక్కడే కొందరు ఆ అధికారిణిని చుట్టుముట్టారు. రైతులను బ్రోకర్ లుగా సంబోదిస్తారా, తక్షణం క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేస్తూ తహసీల్దార్ ను చుట్టుముట్టి దాడికి యత్నించారు. ఆమె కూడా తీవ్రంగానే ప్రతిఘటించారు. పోలీసులు ఆమెకు రక్షణగా నిలిచి అక్కడ నుండి తీసుకొని వెళ్లారు. వనజాక్షి పిర్యాదు మేరకు ఆందోళన కారులపై కేసు నమోదు చేశారు.
ఇదిలా ఉండగా దుగ్గిరాల, పెదకాకాని మండలాల్లోని కొన్ని గ్రామాల పేదలకు ఇళ్ల స్థలాల కోసం ప్రభుత్వ, ప్రైవేట్ భూములు అందుబాటులో లేవు. ఈ గ్రామాల్లోని కొందరు పేదలకు సి ఆర్ డి ఏ పరిధిలోని స్థలాలను కేటాయించాలని ప్రభుత్వం భావిస్తోంది. ఈ నేపథ్యంలో దుగ్గిరాల, పెదకాకాని తహసీల్దార్ లు మల్లీశ్వరి, రమేష్ నాయుడు కృష్ణాయపాలెం లో భూములను పరిశీలించేందుకు వెళ్లగా పెద్ద సంఖ్యలో రైతులు వారిని అడ్డగించారు. తీవ్ర ఉద్రిక్త పరిస్థితి ఏర్పడటంతో మంగళగిరి రూరల్ సిఐ, ఎస్ఐ పెద్ద ఎత్తున పోలీస్ బలగాలతో అక్కడకు చేరుకొని రెవిన్యూ అధికారులను సురక్షితంగా తరలించారు. ఈ ఘటనకు సంభందించి 426మందిపై కేసులు నమోదు చేశారు.
ఈ రెండు సంఘటనలు పరిశీలిస్తే ప్రభుత్వం ఒకింత దూకుడుగానే వ్యవహరిస్తున్నట్లు కనబడుతోంది. పరిపాలన వికేంద్రీకరణ పై దృష్టి పెట్టిన జగన్ ప్రభుత్వం అమరావతి ప్రాంత రైతులకు, కూలీలకు మరింత మేలు చేయాలన్న తలంపుతో గత ప్రభుత్వంతో చేసుకున్న ఒప్పందాల కంటే ఎక్కువ ప్రయోజనం కల్పించేలా నిర్ణయాలు తీసుకున్నది. అయినప్పటికీ కొందరు స్వార్ధ ప్రయోజనాలతో మభ్యపెడుతూ ఆందోళనలు చేయించడాన్ని ప్రభుత్వం తప్పు పడుతున్నది. ఇక్కడే తహసీల్దార్ వనజాక్షి మరోసారి వార్తల్లోకెక్కారు. నాలుగేళ్ళ కిందట దెందులూరు మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ తనపై దాడి చేసారంటూ ఆమె పిర్యాదు చేయడం, ఆ విషయం పెద్ద సంచలనంగా మారడం తెలిసిందే. తాజా ఘటనతో అసలు వనజాక్షి వైఖరి సరైనది కాదని, అందుకే ఆమె వివాదాస్పదమని టీడీపీ వాదిస్తూ నాటి ఘటనను గుర్తు చేస్తుంది.