తుళ్లూరు మండలం వెలగపూడిలో మహిళల నిరసన
అమరావతి: రాజధానిని అమరావతి నుండి మారుస్తారన్న వదంతుల నేపథ్యంలో రైతుల నుండి నిరసనలు హోరెత్తుతున్నాయి. నిన్న తుళ్లూరు మండలం వెలగపూడిలో రైతులు, పెద్ద సంఖ్యలో మహిళలు రాస్తారోకో నిర్వహించగా, నేడు మంగళగిరి మండలం కృష్ణాయపాలెం రైతులు ప్రధాన రహదారిపై భైటాయించి నిరసన తెలియజేశారు.
అమరావతి నుండి రాజధానిని తరలిస్తే సహించేది లేదనీ, ప్రభుత్వం రాజధాని తరలింపుపై నిర్ణయం తీసుకుంటే ఆత్మహత్యలకు కూడా వెనుకాడమంటూ హెచ్చరించారు. ప్రజా ప్రతినిధుల వ్యాఖ్యలపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. మంత్రి బొత్సా సత్యనారాయణకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. రైతుల ఆందోళనతో సచివాలయానికి వెళ్లే దారిలో కిలో మీటరు మేర వాహనాలు నిలిచిపోయాయి.
మరో పక్క రాజధాని ప్రాంత రైతులు ఇప్పటికే బిజెపి రాష్ట అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ, జనసేన అధినేత పవన్ కళ్యాణ్, బిజెపి రాజ్యసభ సభ్యుడు సుజనా చౌదరి తదితర నేతలను కలిసి మద్దతు తెలియజేయాలని కోరారు. రాజధాని ప్రాంత రైతులకు అండగా నిలుస్తామనీ ఈ నేతలు హామీ ఇచ్చారు. మరో వారం రోజుల్లో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ రైతులతో కలసి రాజధాని ప్రాంతంలో పర్యటించనున్నారు.
మంగళగిరి మండలం కృష్ణాయపాలెంలో రైతుల ఆందోళన దృశ్యం