(న్యూస్ ఆర్బిట్ డెస్క్)
గోదావరి నదికి ఉగ్రరూపం దాల్చింది. ఎగువన మహారాష్ట్రలో భారీ వర్షాలు కురుస్తుండటంతో.. మరోసారి భారీగా వరద వస్తోంది. దీంతో నీటి మట్టం అంతకంతకూ పెరుగుతోంది. ఎగువ నుంచి భారీ ఎత్తున వరద వచ్చి చేరుతుండటంతో.. కూనవరం, పోలవరం ప్రాంతాల్లో గోదావరి నీటిమట్టం క్రమంగా పెరుగుతోంది. నది ప్రకోపానికి తూర్పుగోదావరి జిల్లా ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. రాజమహేంద్రవరం వద్ద గోదావరి సముద్రాన్ని తలపిస్తోంది. వరద ఉద్ధృతి పెరగడంతో ధవళేశ్వరం వద్ద అధికారులు రెండో ప్రమాద హెచ్చరికను జారీ చేశారు. నీటిమట్టం 14.10 అడుగులకు పెరగడంతో 13.22 లక్షల క్యూసెక్కుల నీటిని సముద్రంలోకి విడిచిపెట్టారు.
మరోవైపు, వరద ఉద్ధృతి కారణంగా దేవీపట్నం మండలంలోని 36 గ్రామాలతోపాటు విలీన మండలాల్లోని 20 గ్రామాలు జల దిగ్బంధంలో చిక్కుకున్నాయి. చాలా ప్రాంతాల్లో రాకపోకలు స్తంభించాయి. మరోవైపు వేల ఎకరాల్లో పంట పొలాలు నీట మునిగాయి. భద్రాచలం ప్రధాన రహదారిపైకి నీరు రావడంతో రాకపోకలు నిలిచిపోయాయి. వరద ముంపు పొంచి ఉండటంతో.. తూర్పు గోదావరి జిల్లాలో సహాయక చర్యలు చేపట్టడానికి ఎన్డీఆర్ఎఫ్ బలగాలు సిద్ధంగా ఉన్నాయి. ఇప్పటికే పోలవరం ఏజెన్సీ ప్రాంతాలకు ఇతర ప్రాంతాలతో సంబంధాలు తెగిపోయాయి.