ఢిల్లీ: టిడిపికి చెందిన నలుగురు రాజ్యసభ సభ్యులు గురువారం సాయంత్రం మరోసారి రాజ్యసభ ఛైర్మన్ వెంకయ్య నాయుడును కలిసి రాజ్యసభలో తెలుగుదేశం పార్లమెంటరీ పార్టీని బిజెపిలో విలీనం చేయాలని కోరుతూ ఒక లేఖ ఇచ్చారు. రాజ్యాంగం పదవ షెడ్యూల్ నాలుగవ పేరా ప్రకారం విలీనం ఆమోదించాలని వారు కోరారు.
ఉదయం రాజ్యసభలో తెలుగుదేశం పార్లమెంటరీ పార్టీ సమావేశమై బిజెపిలో విలీనం కావాలని నిర్ణయించినట్లు లేఖలో పేర్కొన్నారు. ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంలో దేశాభివృద్ధికి పాటు పడాలని వారు తీర్మానించారు. సుజనా చౌదరి, సిఎం రమేష్, గరికిపాటి మోహనరావు, టిజి వెంకటేష్ రాజ్యసభ ఛైర్మన్ వెంకయ్య నాయుడును కలిసినపుడు తెలంగాణకు చెందిన కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి కూడా అక్కడే ఉన్నారు. అనంతరం బిజెపి కార్యాలయంలో ఈ నలుగురినీ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ జెపి నడ్డా పార్టీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.
అనంతరం సుజనా చౌదరి మాట్లాడుతూ, దేశం మూడ్ ఎలా ఉందో మొన్నటి ఎన్నికలలో స్పష్టమయిదనీ, అది చూసి తాము మోదీ నాయకత్వంలో దేశాభివృద్ధి కోసం పాటుపడాలని నిర్ణయించామనీ చెప్పారు. తాను మూడున్నర సంవత్సరాలు మోదీ నాయకత్వంలో మంత్రివర్గంలో పని చేసిన విషయాన్ని ఆయన ప్రస్తావించారు. ఆంధ్రప్రదేశ్ విభజన హమీల అమలుకు కృషి చేస్తామని ఆయన పేర్కొన్నారు.
ముందు రిపోర్టు 5:38 గంటలు: ఊహాగానాలు నిజమేనని రుజువయింది. బిజెపి వత్తిడి వ్యూహం ఫలించింది. టిడిపికి చెందిన నలుగురు రాజ్యసభ సభ్యులు పార్టీకి గుడ్బై చెప్పారు. ప్రస్తుతానికి తమను ప్రత్యేక గ్రూప్గా పరిగణించాలని కోరుతూ రాజ్యసభ ఛైర్మన్ వెంకయ్య నాయుడుకు లేఖ ఇచ్చారు. అయితే వారి అడుగులు బిజెపివైపేనని తేలిపోయింది. దీనితో రాజ్యసభలో ఇక టిడిపికి ఇద్దరే సభ్యులు మిగిలారు
రాజ్యసభ సభ్యులు సుజనా చౌదరి, సిఎం రమేష్, టిజి వెంకటేశ్, గరికిపాటి మోహనరావు ఈరోజు రాజ్యసభ ఛైర్మన్ ఇచ్చిన విందు సమావేశానికి హాజరయ్యారు. తమను టిడిపి సభ్యులుగా కాకుండా వేరే గ్రూప్గా పరిగణించాలంటూ అక్కడే ఆయనకు లేఖ ఇచ్చారు. నిజానికి వీరిలో కనీసం ఇద్దరు – చౌదరి, రమేష్ – బిజెపి నాయకత్వంతో ఎప్పటికప్పుడు సంప్రదింపులు జరుపుతునే ఉన్నారు.
ఆ ఇద్దరూ ఈ రోజు ఉదయం ప్రధాని నరేంద్ర మోదీ, బిజెపి అధ్యక్షుడు అమిత్ షాలను కలుసుకున్నారు. రాజ్యసభ ఛైర్మన్కు లేఖ ఇచ్చిన తర్వాత తనను ప్రశ్నించిన మీడియాతో సుజనా చౌదరి మాట్లాడుతూ, బిజెపిలో చేరడం ఖాయమేనని చెప్పారు. మరో ఎంపి వెంకటేష్ ఎఎన్ఐ వార్తాసంస్థతో మాట్లాడుతూ, అదే విషయం చెప్పారు. తాను విద్యార్ధి దశలో ఎబివిపి సభ్యుడనని పేర్కొంటూ, ఆ విధంగా బిజెపి తనకు కొత్త కాదని అన్నారు.
బిజెపికి రాజ్యసభలో సీట్లు కావాలి. మాకు మా ప్రాంతం అభివృద్ధి కావాలి అని వెంకటేష్ పేర్కొన్నారు.