(న్యూస్ ఆర్బిట్ డెస్క్)
ఒసామా బిన్ లాడెన్ కుమారుడు, అల్ ఖైదా నాయకత్వానికి వారసుడు అయిన హంజా బిన్ లాడెన్ను హతమార్చినట్లు తెలిసిందని అమెరికా మీడియా రిపోర్టు చేసింది. హంజా మృతిని ముగ్గురు అధికారులు ధృవీకరించారని ఎన్బిసి న్యూస్ తెలిపింది. ఆ ఛానల్ అంతకుమించి వివరాలు ఏమీ ఇవ్వలేదు.
తర్వాత న్యూయార్క్ టైమ్స్ పత్రిక కూడా ఇదే విషయం తెలిపింది. గత రెండేళ్ల కాలంలో ఎప్పుడో గానీ హంజా మృతి చెందినట్లు ఇద్దరు అధికారులు ధృవీకరించారని ఆ పత్రిక పేర్కొన్నది. అమెరికాకు కూడా ప్రమేయం ఉన్న ఒక ఆపరేషన్లో హంజాను హతమార్చినట్లు ఆ అధికారులు తెలిపారు.
ఈ విషయంపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ను విలేఖరులు ప్రశ్నించినపుడు ఆయన అవుననీ కాదనీ చెప్పలేదు. నేను వ్యాఖ్యానించదలచుకోలేదు అని సమాధానమిచ్చారు. హంజా ఆచూకీ చెప్పిన వారికి పది లక్షల డాలర్లు బహుమతి ఇస్తామని ఈ సంవత్సరం ఫిబ్రవరిలో అమెరికా విదేశాంగ శాఖ ప్రకటించింది. దానికి ముందే హంజా మరణించినట్లు ఈ వార్తలు సూచిస్తున్నాయి.
ఒసామా బిన్ లాడెన్ 20 మంది సంతానంలో 15వ వాడైన 30 ఏళ్ల హంజా అతని మూడవ భార్యకు పుట్టాడు. అల్ ఖైదా నాయకుడిగా గుర్తింపు తెచ్చుకుంటున్న వ్యక్తిగా హంజాను అమెరికా విదేశాంగ శాఖ అభివర్ణించింది.