అమరావతి: రాజధాని అమరావతి ప్రాంతంలో మంగళవారం ఈదురుగాలులతో కూడిన భారీ వర్షం కురిసింది. మంగళవారం మధ్యాహ్నాం వాతావరణం ఒక్కసారిగా మారింది. నాలుగు రోజులుగా మండుతున్న ఎండలతో అల్లాడిన ప్రజానీకానికి ఒక సారిగా వాతావరణం చల్లబడటం ఊరటనిచ్చింది. గుంటూరు జిల్లా అమరావతి,మంగళగిరి, తాడేపల్లి, తాటికొండ తదితర ప్రాంతాల్లో
ఒక్కసారిగా ఈదురు గాలులతో కూడిన భారి వర్షం కురిసింది.
ఈదురు గాలుల భీభత్సానికి రాష్ట్ర సచివాలయంలో రేకులు ఎగిరిపడ్డాయి. సచివాలయ ప్రాంగణంలో స్మార్ట్పోల్, ఎంట్రిపాయింట్ కుప్పకూలాయి. బ్లాక్ టెర్రస్లో రేకులు ఎగిరిపడగా, నాలుగో బ్లాక్లో రేకులు ఈదురుగాలల ధాటికి విరిగిపోయాయి. అలాగే హైకోర్టు క్యాంటిన్ పైకప్పు రేకులు ఎగిరిపడ్డాయి. ఈ రేకులు పడటంతో ఒక మహిళకు తీవ్ర గాయాలయ్యాయి. ఆమెను వెంటనే మంగళగిరి ఎన్ఆర్ఐ ఆసుపత్రికి తరలించారు. మంగళగిరి- తెనాలి మార్గమధ్యలో కోకాకోలా కంపెనీ సమీపంలో భారీ వృక్షం నెలపై పడింది. దీంతో ట్రాఫిక్ అంతరాయం ఏర్పడింది. ఈదురు గాలులకు పలు చోట్ల హోర్డింగ్లతో పాటు చిన్నచిన్న చెట్లు, టెంట్లు కూలిపోయాయి, పలు ప్రదేశాల్లో విద్యుత్ వైర్లు తెగడంతో విద్యుత్ సరఫరా నిలిచిపోయింది.
పశ్చిమ గోదావరి, గుంటూరు జిల్లాలకు పిడుగులు పడే అవకాశముందని ఆర్టిజిఎస్ తెలిపింది. పశ్చిమగోదావరి జిల్లా పోలవరం, గుంటూరు జిల్లా తాడేపల్లి, మంగళగిరి, తాడికొండ, దుగ్దిరాల మండలాల్లో పిడుగులు, ఈదురుగాలులతో కూడిన వర్షం పడే అవకాశం ఉందని ఆర్టిజిఎస్ హెచ్చరించింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలనీ, తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించింది.