న్యూఢిల్లీ: పుల్వామా ఉగ్రదాడికి ప్రతీకారంగా పాక్పై జరిపిన వైమానిక దాడిలో దాదాపు 300 మందికిపైగా ఉగ్రవాదులు హతమైనట్టు భద్రతాదళాలు అంచనా వేస్తున్నాయి. మంగళవారం తెల్లవారుజామున భారత్ జరిపిన సర్జికల్ స్ట్రయిక్స్ ధాటికి పీవోకేలో ఉన్న అతిపెద్ద జైషే ఉగ్ర శిబిరం(బాలకోట్) పూర్తిగా ధ్వంసమైంది.
బాలాకోట్ తోపాటు చకోటి, ముజఫరాబాద్లోని 3 ఉగ్రశిబిరాలు కూడా పూర్తిగా నేలమట్టమయ్యాయి. మంగళవారం తెల్లవారుజామున 3.30గంటల ప్రాంతంలో భారత సరిహద్దుల నుంచి బయలుదేరిన 12 మిరాజ్2000 యుద్ధ విమానాలు, డ్రోన్లు మెరుపు దాడులు చేయడంతో పాక్లోని ఉగ్రవాద శిబిరాలు సర్వనాశనం అయ్యాయి.
ఆ శిబిరాల్లో ఉగ్రవాదులు ఉండి ఉంటే… వాళ్లు తప్పించుకునే అవకాశమే లేనంతగా భీకర దాడులు జరిపాయి భారత వైమానిక దళాలు. ఈ దాడుల్లో ఇజ్రాయెల్ టెక్నాలజీ కలిగిన లేజర్ బాంబులను వైమానిక దళం ఉపయోగించింది. కార్గిల్ తర్వాత వీటిని వినియోగించడం ఇదే తొలిసారి.
పాకిస్థాన్ భూభాగంలోకి 1971 యుద్ధం తర్వాత భారత యుద్ధ విమానాలు వెళ్లడం ఇదే మొదటిసారి కావడం గమనార్హం. పుల్వామా దాడి తర్వాత పాకిస్థాన్ ఉగ్రవాదంపై ఎలాంటి చర్యలు తీసుకోకపోవడంతోనే తాము ఈ దాడికి దిగాల్సి వచ్చిందని భారత విదేశాంగ కార్యదర్శి విజయ్ గోఖలే మంగళవారం వెల్లడించారు.
భారత వైమానిక దళాలు తమ సరిహద్దులోకి వచ్చి దాడులకు పాల్పడ్డాయని, అయితే, ఎలాంటి నష్టం జరగలేదని పాక్ పేర్కొంది. తమ దేశ భూభాగంలోకి చొచ్చుకొని వచ్చిన భారత యుద్ధ విమానాలను సమర్థవంతంగా తిప్పికొట్టామని ఆ దేశ ఇంటర్ సర్వీసెస్ పబ్లిక్ రిలేషన్స్ డైరెక్టర్ జనరల్ అసిఫ్ గఫూర్ చెప్పుకొచ్చారు.