మంగళూరు, మార్చి 9 : భారత్ ఇప్పటివరకు రెండు సార్లు మాత్రమే సరిహద్దు దాటి మెరుపు దాడులు చేసిందని ప్రపంచానికి తెలుసు. కానీ భారత్ మూడు సార్లు మెరుపు దాడులు చేసిందని కేంద్ర హోంమంత్రి రాజ్నాథ్ సింగ్ సంచలన ప్రకటన చేశారు. మూడోది ఏంటనేది మాత్రం వెల్లడించలేదు.
శనివారం కర్ణాటకలోని మంగళూరులో ఎన్నికల ప్రచార సభలో పాల్గొన్న రాజ్ నాథ్ సింగ్…’గత ఐదేళ్లలో భారత్ మూడు సార్లు సరిహద్దు దాటి విజయవంతంగా మెరుపు దాడులు చేసింది. రెండు సార్లు ఎప్పుడనేది మీకు చెప్తాను. కానీ మూడోవ దాని గురించి మాత్రం చెప్పను. మొదటి సారి యూరి ఉగ్రదాడి జరిగినప్పుడు.. పాకిస్తాన్ నుంచి వచ్చిన ఉగ్రవాదులు మన సైనికుల్ని చంపారు. దానికి ప్రతీకారంగా మన సైనికులు దాడి చేసి బదులిచ్చారు. రెండవది పుల్వామా ఘటన జరిగినప్పుడు. మూడోది ఎప్పుడనేది మాత్రం నేను చెప్పను’ అని వివరించారు.
2016 లో జరిగిన యూరి దాడి , ఇటీవల పుల్వామా ఘటన అనంతరం భారత్ జరిపిన మెరుపు దాడుల గురించి అందరికీ తెలుసు. కానీ ఈ రెండు మెరుపు దాడులకంటే ముందు అనగా 2015 జూన్లో భారత ఆర్మీ సరిహద్దు దాటి మయన్మార్ భూభాగంలోకి అడుగుపెట్టి నేషనల్ సోషలిస్ట్ కౌన్సిల్ ఫర్ నాగాలాండ్కు చెందిన మిలిటెంట్ల క్యాంప్లను నాశనం చేసింది.
మణిపూర్లోని చందేల్ జిల్లాలో మిలిటెంట్లు భారతసైన్యం మీద దాడి చేసి 18 మంది జవాన్ల చావుకు కారణమయ్యారు. సరిగ్గా వారం తర్వాత భారత్ ఈ దాడికి ప్రతీకారం తీర్చుకుంది. బహుశా ఇదే అనుకుంట రాజ్నాధ్ సింగ్ దాచిన మెరుపుదాడి.