(న్యూస్ ఆర్బిట్ డెస్క్)
భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) ఛైర్మన్ కే శివన్ సెలబ్రిటీల కంటే తక్కువ కాదు. చంద్రయాన్ 2 ప్రయోగంతో ఆయన దేశ కీర్తిని ప్రపంచం అంతా ప్రతిధ్వనించేలా చేశారు. అంతేకాదు దేశవ్యాప్తంగా ప్రజల హృదయాలను గెలుచుకున్నారు. ఇటీవల ఇండిగో విమానంలో ఇస్రో శివన్ ఎకానమి క్లాసులో ప్రయాణించారు. విమానంలోకి ఎక్కిన వెంటనే ఎయిర్ హోస్టెస్ లు శివన్ ను గుర్తు పట్టారు. అనంతరం పలువురు ప్రయాణికులు ఆయనకు చప్పట్లు కొడుతూ స్వాగతించారు. ఆయనతో సెల్ఫీలు దిగడానికి పోటీ పడ్డారు. వారిని నిరాశకు గురి చేయకుండా ఓపిగ్గా ఎయిర్ హోస్టెస్ లతో ఫొటోలు దిగారు శివన్. తోటి ప్రయాణికులను చిరునవ్వుతో పలకరిస్తూ తన సీటు వైపు కదిలారాయ. దీనికి సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. శివన్ సింప్లిసిటీ పట్ల ప్రశంసలతో ముంచెత్తుతున్నారు. దేశానికి గర్వకారణమైన అంతరిక్ష శాస్త్రవేత్తగా ఆయనను అభివర్ణిస్తున్నారు.
It is so heartening to see ISRO chief #Sivan sir being given a hero’s reception in a flight!! https://t.co/IJth3RTaxI
— Shefali Vaidya. (@ShefVaidya) October 4, 2019
ఇస్రో ప్రతిష్ఠాత్మకంగా ప్రయోగించిన చంద్రయాన్-2 మిషన్ తరువాత ఆ సంస్థ ఛైర్మన్ కే శివన్ పేరు దేశవ్యాప్తంగా మారుమోగిపోయింది. సెప్టెంబర్ 7వ తేదీన చంద్రుడి ఉపరితలంపై దిగాల్సిన విక్రమ్ ల్యాండర్ దారి తప్పిన తరువాత ఇస్రో గ్రౌండ్ స్టేషన్ లో చోటు చేసుకున్న ఉద్విగ్నభరిత పరిణామాలు ఆయనను దేశ ప్రజలకు సుపరిచితులను చేశాయి. చంద్రయాన్-2లోని విక్రమ్ ల్యాండర్ నుంచి సంకేతాలు నిలిచిపోయాయన్న బాధతో శివన్ ఒక్కసారిగా కన్నీరు పెట్టుకోవడం, ఆయన్ని ప్రధాని మోదీ హత్తుకొని ఓదార్చిన సంగతి తెలిసిందే.