న్యూఢిల్లీ: ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి ఆదిత్యనాధ్పై అభ్యంతరకరమైన పోస్టింగ్ పెట్టాడన్న అభియోగంపై ఢిల్లీకి చెందిన ఒక ఫ్రీలాన్స్ జర్నలిస్టును లక్నో పోలీసులు అరెస్టు చేసారు. ఆదిత్యనాధ్ ప్రతిష్టకు భంగం కలిగించే ప్రసారాలు చేశారంటూ నోయిడాలోని ఒక న్యూస్ ఛానల్ ఎడిటర్నూ, యజమానినీ కూడా శనివారం సాయంత్రం ఉత్తరప్రదేశ్ పోలీసులు అరెస్టు చేశారు.
గతంలో పలు మీడియా సంస్థల్లో పని చేసిన ప్రశాంత్ కనోజియాను పోలీసులు ఢిల్లీనుంచి లక్నో తీసుకువెళ్లి అక్కడ అరెస్టు చూపించారు. ఆదిత్యనాధ్ కార్యాలయం ముందు ఒక మహిళ మీడియాతో మాట్లాడే వీడియోను కనోజియా ఫేస్బుక్, ట్విట్టర్లో పోస్టు చేశారు. తాను ముఖ్యమంత్రికి వివాహం ప్రతిపాదన పంపానని ఆమె ఆ వీడియోలో చెబుతారు.
సమాచార చట్టంలోని 67వ సెక్షన్ కింద కనోజియాను అరెస్టు చేశారు. క్రిమినల్ పరువునష్టం సెక్షన్ కూడా తగిలించారు. కనోజియా అరెస్టును పలువురు జర్నలిస్టులు ఖండించారు. ఇది చట్టాన్ని దుర్వినియోగం చేయడమేనని వైర్ వెబ్సైట్ సంపాదకులు సిద్ధార్ధ వరదరాజన్ వ్యాఖ్యానించారు.
నేషన్ లైవ్ అనే న్యూస్ ఛానల్ ఎడిటర్నూ, యజమానినీ కూడా ఉత్తరప్రదేశ్ పోలీసులు అరెస్టు చేశారు. కనోజియా పోస్టు చేసిన వీడియోలో మాట్లాడిన మహిళను ఆ ఛానల్లో లైవ్లో కూర్చోబెట్టారు. అనంతరం ఒక రాజకీయపార్టీకి చెందిన కార్యకర్తలు పోలీసులకు ఫిర్యాదు చేశారు. నిజానిజాలు విచారించకుండా ఆ మహిళ వాదనను ప్రసారం చేశారని వారు ఫిర్యాదు చేశారు. దాని ఆధారంగా అరెస్టులు జరిగాయి. దర్యాప్తులో ఆ ఛానల్కు అసలు లైసెన్సే లేదని తేలినట్లు పోలీసులు తెలిపారు.