హైదరాబాద్: తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్టును ముఖ్యమంత్రి కెసిఆర్ జాతికి అంకితం చేశారు. మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రులు దేవేంద్ర ఫడ్నవీస్, వైఎస్ జగన్మోహనరెడ్డితో కలిసి సిఎం కెసిఆర్ మేడిగడ్డలోని ఆరవ నెంబర్ మోటార్ను ఆన్ చేసి గోదావరి ఎత్తిపోతలకు శ్రీకారం చుట్టారు.
జల సంకల్ప యాగం అనంతరం ముగ్గురు ముఖ్యమంత్రులు, గవర్నర్ మేడిగడ్డ బ్యారేజీ వద్దకు వెళ్లారు. ప్రాజెక్టు ఏ విధంగా రూపుదిద్దుకుంది, స్వదేశి టెక్నాలజీని ఏ రకంగా ఉపయోగించుకున్నారు తదితర విషయాలను మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్ సిఎంలకు కెసిఆర్ వివరించారు. ఇంజనీరింగ్ మ్యాప్ ద్వారా పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇస్తూ వారికి కాళేశ్వరం ప్రాజెక్టు విషయాలు తెలియజేశారు. శిలాఫలకాన్ని వైఎస్ జగన్ ఆవిష్కరించారు. బ్యారేజ్ వద్ద గవర్నర్, సిఎంలు ఫడ్నవీస్, వైఎస్ జగన్ తదితరులు కొబ్బరికాయలు కొట్టారు. కెసిఆర్ గుమ్మడికాయ కాయను కొట్టి, రిబ్బన్ కట్ చేసి బ్యారేజీని ప్రారంభించారు. అనంతరం కన్నెపల్లి పంప్ హౌస్ వద్దకు చేరుకొని పూజలు జరిపారు. అక్కడి శిలాఫలకాన్ని కెసిఆర్ ఆవిష్కరించారు. తదుపరి మోటార్కు స్విచ్ఆన్ చేసి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర మంత్రులు, పార్లమెంట్ సభ్యులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఇంజనీరింగ్ ఉన్నతాధికారులు పాల్గొన్నారు.