అరవకురిచి(తమిళనాడు): ప్రముఖ సినీ నటుడు, మక్కల్ నీది మయ్యుం పార్టీ వ్యవస్థాపకుడు కమల్ హాసన్ హిందూ ఉగ్రవాదంపై చేసిన వ్యాఖ్యలు తీవ్ర వివాదాస్పదమైయాయి. తమిళనాడులోని అరవకురిచిలో ఆదివారం రాత్రి జరిగిన ఎన్నికల ప్రచార ర్యాలీలో ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు.
స్వతంత్ర భారత్లో ‘తొలి తీవ్రవాది హిందూ’ అని వ్యాఖ్యానించారు. గాంధీని చంపిన నాథూరామ్ గాడ్సే తొలి హిందూ తీవ్రవాదిగా పేర్కొన్నారు.
దేశంలోని ప్రజలంతా సమానత్వంతో జీవించాలని కోరుకునే భారతీయుల్లో తానూ ఒకడినని పేర్కొంటూ త్రివర్ణ పతాకంలోని మూడు రంగులు వివిధ వర్గాల విశ్వాసాలను సూచించినట్లుగానే తాను కూడా అందరూ కలిసి ఉండాలని కోరుకుంటానని కమల్ పేర్కొన్నారు. ‘ఈ ప్రాంతంలో ముస్లిం సోదరులు ఎక్కువగా ఉన్న కారణంగా నేను ఈ వ్యాఖ్యలు చేయడం లేదు. గాంధీ విగ్రహం ఎదుట నిలబడి నేను ఈ మాటలు మాట్లాడుతున్నాను. స్వతంత్ర భారత్లో తొలి తీవ్రవాది హిందూ. ఆయన పేరు నాథూరామ్ గాడ్సే. అప్పటి నుంచే ఈ ఉగ్రవాదం ప్రారంభమైంది’ అని కమల్ హాసన్ చెప్పారు.
ఒక గాంధేయవాదిగా ఆయన హత్యకు గల కారణాలను తెలుసుకోవాలనుకుంటున్నానని కమల్ అన్నారు. .
గతంలోనూ కమల్ హాసన్ ఈ తరహా వ్యాఖ్యలు చేసి వివాదంలో చిక్కుకున్నారు.
2017 నవంబరులో ఒక సందర్భంలో ‘హిందూ తీవ్రవాదం’ అనే పదజాలం ఉపయోగించడంపై పెద్ద రాద్ధాతమే జరిగింది. కమల్ వ్యాఖ్యల్ని నాడు బిజెపితో పాటు పలు హిందూ సంఘాలు తీవ్రంగా ఖండించాయి. ఆయన వెంటనే క్షమాపణ చెప్పాలని కూడా డిమాండ్ చేశాయి. ఇప్పుడు కూడా కమల్ వ్యాఖ్యలు వివాదాస్పదం అయ్యాయి. ఆయన వ్యాఖ్యలను పలు హింధూ సంఘాలు ఖండిస్తున్నాయి.