బెంగళూరు: కర్నాటక ముఖ్యమంత్రిగా యడ్యూరప్ప ఈ రోజు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. కుమారస్వామి నేతృత్వంలోని ప్రభుత్వం విశ్వాస పరీక్షలో ఓడిపోయి రాజీనామా చేసిన విషయం తెలిసిందే. కొద్ది సేపటి క్రితం యడ్యూరప్ప గవర్నర్ వాజూభాయ్ వాలాను కలిసి ప్రభుత్వం ఏర్పాటుకు అవకాశం ఇవ్వాలని కోరారు. గవర్నర్ నుంచి వెంటనే అనుమతి రావడంతో సాయంత్రం ఆరు గంటల తర్వాత యడ్యూరప్ప ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. యడ్యూరప్ప ఒక్కరే నేడు ప్రమాణం చేసే అవకాశం ఉంది.
ముగ్గురు ఎమ్మెల్యేలపై అనర్హత వేటు పడటంతో సభలోని సభ్యుల సంఖ్య 221కి తగ్గింది. ప్రభుత్వం ఏర్పాటు చేయాలంటే 111మంది సభ్యుల మద్దతు ఉండాలి. బిజెపి చేతిలో 105మంది ఎమ్మెల్యేలు మాత్రమే ఉన్నారు. మరో వైపు మిగిలిన 14మంది ఎమ్మెల్యేల రాజీనామాలను స్పీకర్ పరిశీలించి వారి మీద కూడా చర్యలు తీసుకునే అవకాశాలు ఉన్నాయి.
యడ్యూరప్ప ఇప్పటి వరకూ మూడు సార్లు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు.