(న్యూస్ ఆర్బిట్ డెస్క్)
తెలంగాణలో ఆర్టీసీ సమ్మెలో పాల్గొన్న ఉద్యోగులందరినీ విధుల నుంచి తొలగిస్తున్నట్లు ప్రకటించిన సీఎం కేసీఆర్.. ఇప్పుడు ఈ నిర్ణయంపై మరోసారి సమీక్షిస్తున్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ విధులకు రాబోమని భీష్మించుకు కూర్చున్న దాదాపు 46 వేల మంది కుటుంబాలు రోడ్డున పడకుండా చూడాలన్న ఆలోచనలో సీఎం కేసీఆర్ ఉన్నట్టు సమాచారం. ప్రభుత్వ విధించిన గడువు లోపల విధులకు హాజరుకాని సిబ్బందిని తిరిగి ఉద్యోగాల్లోకి తీసుకోబోమని కేసీఆర్ స్పష్టం చేశారు. ప్రస్తుతం ఆర్టీసీలో ప్రస్తుతం 1200 మంది సిబ్బంది మాత్రమే మిగిలి ఉన్నారని ప్రకటించారు. అయితే ప్రభుత్వ నిర్ణయంతో టీఎస్ఆర్టీసీలో పనిచేస్తున్న 46 వేలమంది ఉద్యోగులు రోడ్డున పడే ప్రమాదమున్నందున.. మరోసారి సీఎం కేసీఆర్ తన నిర్ణయంపై ఆలోచన చేస్తున్నట్టు సమాచారం. సమ్మె కారణంగా ఇబ్బందులు పడుతున్న ప్రజలకు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేస్తూనే, కార్మికులకు మరో అవకాశం ఇవ్వాలని కేసీఆర్ భావిస్తున్నట్టు తెలుస్తోంది. అందులో భాగంగా సోమవారం మరోసారి ఉన్నతాధికారులతో కేసీఆర్ సమీక్ష నిర్వహించనున్నారు. నిన్నటి సమీక్ష సమావేశానికి కొనసాగింపుగా నేటి సమావేశం జరుగుతుందని అధికారులు తెలిపారు.
మరోవైపు ఆర్టీసీ కార్మికుల సమ్మె మూడో రోజు మరింత తీవ్రరూపం దాల్చింది. సగానికి పైగా బస్సులు డిపోలకు పరిమితం అయ్యాయి. పండుగ సీజన్ కావడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. విపక్ష పార్టీలు సైతం ఆర్టీసీ కార్మికులకు మద్దతిస్తూ, నిరసనలకు దిగుతున్నాయి. దీంతో కొన్ని ప్రాంతాల్లో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. ఈ నేపథ్యంలో సీఎం కేసీఆర్ మరోసారి సమీక్ష నిర్వహించాలని నిర్ణయం తీసుకోవడం ప్రాధాన్యత సంతరించుకుంది.
నిబంధనలకు విరద్ధంగా సమ్మె చేస్తున్నారంటూ ఆర్టీసీ కార్మికులపై సీఎం కేసీఆర్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. ఇక యూనియన్ నేతలతో చర్చలు జరిపేది లేదంటూ తేల్చి చెప్పేశారు. ప్రస్తుతం ఆర్టీసీలో ప్రస్తుతం 1200 మంది సిబ్బంది మాత్రమే మిగిలి ఉన్నారని సీఎం ప్రకటించారు. కొద్ది రోజుల్లోనే కొత్త సిబ్బందిని నియమించాలని, నియామక ప్రక్రియ త్వరగా చేపట్టాలని నిర్ణయించారు. కొత్తగా చేర్చుకునే సిబ్బంది యూనియన్లలో చేరమని ఒప్పంద పత్రం మీద సంతకం చేయాలని కేసీఆర్ స్పష్టం చేశారు. అంతేకాదు ప్రభుత్వంలో ఆర్టీసీని విలీనం చేసే ప్రసక్తే లేదని తెగేసి చెప్పారు. ఆర్టీసీని లాభాల్లోకి తీసుకు పోవాలనీ, సంస్థ మనుగడ కొనసాగాలంటే కొన్ని చర్యలు తప్పవన్నారు సీఎం. ఏడాదికి రూ.1200 కోట్ల నష్టంతో, రూ. 5000 కోట్ల రుణభారంతో, క్రమబద్ధంగా పెరుగుతున్న డీజిల్ ధరలతో, ఆర్టీసీ ఇబ్బందుల్లో ఉన్న సమయంలో చట్ట విరుద్ధమైన సమ్మెకు దిగడం తీవ్రమైన తప్పు అని అన్నారు. ఇక వారితో ఎలాంటి చర్చలు జరిపేది లేదని కేసీఆర్ స్పష్టం చేశారు. యూనియన్ల బ్లాక్మెయల్ రాజకీయాలకు ప్రభుత్వం తలవంచదన్నారు తెలంగాణ సీఎం. ఇకపై ఆర్టీసీ బస్సుల్లో సగం ప్రయివేట్ బస్సులుంటాయని, మిగతా సగం ఆర్టీసీ యాజమాన్యానివని ప్రభుత్వం తెలిపింది. పబ్లిక్-ప్రైవేట్ భాగస్వామ్యం పద్ధతిలో చర్యలు చేపట్టితే బస్సులు బాగా నడుస్తాయి పేర్కొన్న సంగతి తెలిసిందే.