హైదరాబాద్: బిజెపి జాతీయ అధ్యక్షుడు, కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్షాతో ఆంధ్రజ్యోతి ఎండి రాధాకృష్ణ ప్రత్యేకంగా సమావేశం అయ్యారు. ఢిల్లీలో అమిత్షా నివాసానికి వెళ్లి రాధాకృష్ణ భేటీ కావడం ప్రాధాన్యతను సంతరించుకున్నది.
ఆర్టికల్ 370 రద్దు తరువాత వివిధ రంగాలకు చెందిన ప్రముఖులను కేంద్ర మంత్రులు కలుస్తున్నారు. ఇటీవల హైదరాబాద్కు వచ్చిన కేంద్ర మంత్రులు మీడియా అధిపతులనూ కలిశారు. అయితే అమిత్షా స్వయంగా ఆర్కెను తన ఇంటికి ఆహ్వానించి మాట్లాడటం తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్గా మారింది.
ఉభయ తెలుగు రాష్ట్రాల్లో పార్టీ బలోపేతానికి పావులు కదుపుతున్న బిజెపి అధిష్టానం మీడియా మద్దతునూ కూడగట్టుకునే క్రమంలో భాగంగా ఆ పార్టీ నేతలు, కేంద్ర మంత్రులు మీడియా సంస్థల అధినేతలతో సన్నిహిత సంబంధాలు నెలకొల్పుకుంటున్నారు. ఇటు తెలంగాణ సిఎం కెసిఆర్, అటు ఆంధ్ర ప్రదేశ్ సిఎం జగన్ ఆర్కే పట్ల ఎలా వ్యవహరిస్తున్నారో రెండు రాష్ట్రాల రాజకీయ నాయకులకు, ప్రజలకు తెలిసిందే. వైఎస్ఆర్ కాలం నుండి ఆ రెండు పత్రికలు అంటూ విమర్శించగా ఇప్పుడు ఎల్లో మీడియా అంటూ వైసిపి నేతలు విమర్శలు గుప్పిస్తూ వస్తున్నారు. ఏపిలో ఏబిఎన్ ప్రసారాల నిలిపివేతలో జగన్ ప్రభుత్వ పాత్ర ఉందంటూ ఆ మీడియా సంస్థ ఆరోపించింది. ఈ నేపథ్యంలో ఇప్పటి వరకూ టిడిపికి అనుకూలంగా వ్యవహరిస్తూ వచ్చిన ఈ మీడియా బాస్ కేంద్రంలో నెంబర్ 2 పొజిషన్లో ఉన్న అమిత్షాను కలవడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమవుతోంది.