తిరుమల: నిన్న తిరుమల చేరుకున్న తెలంగాణ ముఖ్యమంత్రి కె చంద్రశేఖరరావు దంపతులు సోమవారం విఐపి బ్రేక్ దర్శన సమయంలో మహద్వారం గుండా ప్రవేశించి శ్రీవెంకటేశ్వరస్వామి వారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు.
టిటిడి కార్యనిర్వహణ అధికారి అనిల్ కుమార్ సింఘాల్ ఆధ్వర్యంలో ఆలయ వేదపండితులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. స్వామివారి దర్శనానంతరం ఆలయ మర్యాదలతో స్వామి వారి శేషవస్త్రాలతో సత్కరించి తీర్థప్రసాదాలు అందజేశారు. వేదపండితులు ఆశీర్వచనాలు అందించారు.
టిటిడి అతిధి మర్యాదల పట్ల కెసిఆర్ సంతోషం వ్యక్తం చేస్తూ అధికారులు, వేదపండితులకు ధన్యవాదాలు తెలియజేశారు. కొండ దిగిన అనంతరం కెసిఆర్ దంపతులు తిరుచానూరు వెళ్లి శ్రీ పద్మావతీ అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు జరిపారు. తరువాత తుమ్మలగుంటలోని వైసిపి ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఇంటికి వెళ్లి ఆతిధ్యం స్వీకరించారు. అనంతరం శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామిని దర్శించుకొని ప్రత్యేక పూజలు జరిపారు. తదుపరి రేణిగుంట చేరుకుని, ప్రత్యేక విమానంలో హైదరాబాద్కు తిరుగు ప్రయాణం అయ్యారు.
వైసిపి ఎమ్మెల్యేలు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, చెవిరెడ్డి భాస్కరరెడ్డి, భూమన కరుణాకరరెడ్డి, వైసిపి ఎంపి రెడ్డప్ప తదితర ప్రముఖులు కెసిఆర్ వెంటే ఉండి ఏర్పాట్లు పర్యవేక్షించారు. వైసిపి ఎమ్మెల్యేలకు కెసిఆర్ ధన్యవాదాలు తెలియజేశారు.