(న్యూస్ ఆర్బిట్ బ్యూరో)
ముంబై: మహారాష్ట్ర శాసనసభలో బుధవారం నాటి నూతన ఎమ్మెల్యేల ప్రమాణస్వీకారం అరుదైనది. కారణం ఏమంటే రాష్ట్రంలో ముఖ్యమంత్రి లేకుండానే సభ్యులు ప్రమాణస్వీకారం చేయాల్సివచ్చింది. సాధారణంగా ఎన్నికల తర్వాత నూతన ప్రభుత్వం ఏర్పడుతుంది. అనంతరం కొత్త శాసనసభ్యుల ప్రమాణస్వీకారం కోసం సభ సమావేశమవుతుంది. అందులో సభానాయకుడిగా ముఖ్యమంత్రి అందరికన్నా ముందు ప్రమాణస్వీకారం చేస్తారు.
నేడు మొదటిసారిగా సమావేశమైన మహారాష్ట్ర 14వ శాసనసభలో అలా జరగలేదు. గత శనివారం నాడు ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన బిజెపి నేత దేవేంద్ర ఫడ్నవీస్ నేటి బలపరీక్షకు ముందే రాజీనామా చేశారు. విశ్వాసపరీక్షలో నెగ్గేందుకు అవసరమైన బలం లేదని స్పష్టం కావడంతో మంగళవారం నాడు మొదట ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్ ఫడ్నవీస్కు రాజీనామా సమర్పించారు. అనంతరం ఫడ్నవీస్ మీడియా సమావేశంలో రాజీనామా విషయం ప్రకటించి గవర్నర్ దగ్గరకు వెళ్లారు.
24 గంటల లోగా బలపరీక్ష జరగాలనీ, దానికి ముందు శాసనసభ్యుల ప్రమాణస్వీకారం జరగాలనీ సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాలను అనుసరించి నేడు సభ ప్రత్యేకంగా సమావేశమయింది. ఫడ్నవీస్ ముందే రాజీనామా ఇచ్చారు కాబట్టి సభలో బలపరీక్ష అవసరం ఉండదు. శాసనసభ్యుల ప్రమాణస్వీకారానికే సమావేశం పరిమితమవుతుంది.