(న్యూస్ ఆర్బిట్ డెస్క్)
క్షణక్షణం మలుపులు తిరిగిన మహారాష్ట్ర రాజకీయాలు తుది దశకు చేరాయి. శివసేన, ఎన్సీపీ, కాంగ్రెస్ నేతృత్వంలో ఏర్పాటైన ‘మహా వికాస్ అఘాడీ’కూటమి అధికారాన్ని చేపట్టనుంది. రేపు మహారాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉద్ధవ్ ఠాక్రే ప్రమాణస్వీకారం చేయనున్నారు. అయితే, ఈ కొత్త ప్రభుత్వంలో ఎన్సీపీ నేత అజిత్ పవార్ కు ఛాన్స్ ఉంటుందా ? లేదా ? అన్న ప్రశ్న సర్వత్రా వ్యక్తమవుతోంది. అజిత్ పవార్కు మరోసారి కీలకమైన పదవి ఇచ్చేందుకు శరద్ పవార్ అంగీకరిస్తారా ? ఒకవేళ శరద్ పవార్ ఒప్పుకున్నా… ఇందుకు శివసేన, కాంగ్రెస్ ఒప్పుకుంటాయా? అన్నది కూడా ఆసక్తికరంగా మారాయి.
అనూహ్య పరిణామాల మధ్య రాత్రికి రాత్రే బీజేపీకి మద్దతు ఇచ్చిన అజిత్ పవార్…బీజేపీ ప్రభుత్వంలో డిప్యూటీ సీఎంగా నవంబర్ 23న ప్రమాణస్వీకారం చేశారు. అయితే, నాలుగు రోజుల్లోనే మహారాష్ట్ర డిప్యూటీ సీఎం పదవికి రాజీనామా చేశారు. ఎన్సీపీ అధినేత, చిన్నాన్న శరద్ పవార్ మంతనాలు, కుటుంబ ఒత్తిడి మేరకు మళ్లీ సొంత గూటికి తిరిగొచ్చిన అజిత్ పవార్… మహారాష్ట్రలో బీజేపీ వెనక్కి తగ్గడంలో కీలక పాత్ర పోషించారు. అజిత్ పవార్ డిప్యూటీ సీఎం పదవికి రాజీనామా చేసిన కొద్ది గంట్లోనే ముఖ్యమంత్రి పదవికి దేవేంద్ర ఫడ్నవీస్ రాజీనామా చేశారు. దీంతో మహారాష్ట్రలో శివసేన, ఎన్సీపీ, కాంగ్రెస్ కూటమి కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి లైన్ క్లియర్ అయ్యింది.
అయితే, కొత్తగా ఏర్పడబోయే శివసేన, ఎన్సీపీ, కాంగ్రెస్ కూటమి ప్రభుత్వంలో అజిత్ పవార్కు ప్రాధాన్యత ఉంటుందా ? ఆయనకు ఎలాంటి పదవి లభిస్తుంది ? అనే అంశంపై మహారాష్ట్ర రాజకీయవర్గాల్లో చర్చ జరుగుతోంది. శివసేన సీఎం పదవి తీసుకోవడంతో ఎన్సీపీకి డిప్యూటీ సీఎం పదవి దక్కనుంది. ఒకవేళ అజిత్ పవార్ బీజేపీతో చేతులు కలపకపోతే… ఈ కూటమి ప్రభుత్వంలో ఆయన కచ్చితంగా ఉప ముఖ్యమంత్రి పదవి వరించేది. అయితే తాజాగా ఆయన సొంత పార్టీకి హ్యాండ్ ఇచ్చేందుకు ప్రయత్నించి వెనక్కి తగ్గడంతో…అజిత్ పవార్కు కొత్తగా ఏర్పడబోయే కూటమి ప్రభుత్వంలో ఉప ముఖ్యమంత్రి లేదా కీలకమైన మంత్రి పదవి దక్కుతుందా అన్నది ఉత్కంఠగా మారింది.