జైపూర్: రైల్వేలతో రెండేళ్ల పాటు అలుపెరుగని పోరాటం చేసిన తర్వాత.. కోటాకు చెందిన ఒక ఇంజనీరు రూ. 33 రిఫండ్ పొందారు. జీఎస్టీ అమలుకు ముందు తాను టికెట్ రద్దు చేసుకున్నా తన వద్ద వసూలు చేసిన సర్వీసు చార్జి తిరిగివ్వాలని ఆయన పోరాడారు. 2017 ఏప్రిల్ నెలలో టికెట్ బుక్ చేసుకుని, తర్వాత రద్దుచేసుకున్నారు. జులై నెలలో ప్రయాణానికి ఆ టికెట్ బుక్ అయింది.
అయితే, ఐఆర్సీటీసీ నుంచి తనకు రావాల్సిన రూ. 35 రిఫండ్ కోసం సుజీత్ స్వామి (35) అప్పటినుంచి పోరాడుతూనే ఉన్నారు. ఎట్టకేలకు రెండేళ్ల తర్వాత, అది కూడా రెండు రూపాయలు తగ్గించి మిగిలిన సొమ్ము పంపారు. స్వామి 2017 ఏప్రిల్ నెలలో కోటా నుంచి న్యూఢిల్లీకి గోల్డెన్ టెంపుల్ మెయిల్ రైల్లో జూలై 2వ తేదీ ప్రయాణానికి టికెట్ బుక్ చేసుకున్నారు. వెయిట్ లిస్టులో ఉన్న ఆ టికెట్ ధర రూ. 765. ఆయన దాన్ని రద్దు చేసుకుంటే రూ. 665 మాత్రమే రిఫండ్ వచ్చింది. వెయిట్ లిస్టులో ఉన్న టికెట్ రద్దు చేస్తే రూ. 65 మాత్రమే తగ్గించుకోవాల్సి ఉండగా రూ. 100 తగ్గించారని, దానిపై ఎన్నిసార్లు అడిగినా పంపుతామన్నారే గానీ పంపలేదని స్వామి చెప్పారు. ఆ 35 రూపాయలు సర్వీసు చార్జిగా వసూలుచేశారు.
జీఎస్టీ అమలుకు ముందు బుక్ చేసిన టికెట్లకు సర్వీసుచార్జి వసూలు చేస్తామని, అందువల్ల సాధారణంగా అయితే డబ్బులు వెనక్కి ఇవ్వబోమని ఐఆర్సీటీసీ స్వామికి సమాచార హక్కు చట్టం ప్రశ్నకు సమాధానంగా తెలిపింది. 2017 జూలై 1కి ముందు బుక్ చేసిన టికెట్లకు సర్వీసు చార్జిని రిఫండ్ చేయాలని తర్వాత నిర్ణయించామంది. అందువల్ల రూ. 35 రిఫండ్ చేస్తామని తెలిపింది. 2019 మే 1వ తేదీన స్వామి బ్యాంకు ఖాతాలోకి రూ. 33 పడ్డాయి. ఇదే మొత్తం కోసం లోక్ అదాలత్ లో కూడా అతడు పిటిషన్ వేసినా, అది తమ పరిధిలోకి రాదని వారు కొట్టేశారు. ఆర్టీఐ ద్వారా తాను అడిగిన ప్రశ్నను పదిసార్లు శాఖల మధ్య తిప్పారని స్వామి చెప్పారు. ఇంత వేధించి పరిహారం ఇవ్వకపోగా రూ. 2 కోత పెట్టారన్నారు. వాళ్లంతట వాళ్లే రూ. 35 రిఫండ్ చేస్తామన్నారు కాబట్టి మళ్లీ తాను ఐఆర్సీటీసీని అడుగుతానని తెలిపారు. జీఎస్టీ అమలుకు ముందు టికెట్లు రద్దు చేసుకున్న దాదాపు 9 లక్షల మంది ప్రయాణికుల వద్ద ఇలాగే సర్వీసు చార్జి వసూలుచేసినట్లు మరో ఆర్టీఐ సమాధానంలో తెలిసింది. ఇది రూ. 3.34 కోట్లు అవుతుందని, చాలామంది అసలీ విషయాన్నే మర్చిపోయి ఉంటారని స్వామి అన్నారు.