(న్యూస్ ఆర్బిట్ డెస్క్)
మంత్రి పదవి ఆశించి భంగ పడిన వైసిపి సీనియర్ నేత, పెనమలూరు ఎమ్మెల్యే కొలుసు పార్ధ సారధిని ఊరడింపు ప్రయత్నం జరిగింది. బుధవారం ముఖ్య మంత్రి, పార్టీ అధినేత వైఎస్ జగన్మోహనరెడ్డి ప్రకటించిన టిటిడి పాలకమండలిలో ఆయనను డైరెక్టర్గా నియమించారు. వైసిపి అధికారంలోకి రాగానే ఆయనను మంత్రి పదవి వరిస్తుందని భావించారు. అయితే సామాజిక, ప్రాంతీయ సమీకరణలో భాగంగా కొలుసుకు చోటు లభించలేదు.
కృష్ణా జిల్లా నుండి కొడాలి నాని, పేర్ని నాని, వెల్లంపల్లి శ్రీనివాస్ ముగ్గురికి మంత్రి పదవులు ఇవ్వడంతో తొలి మంత్రివర్గ విస్తరణలో అయన ఆశలు ఫలించలేదు. ఈ నేపథ్యంలో విప్ పదవికి జగన్ ఆయనను ఎంపిక చేశారు. అయితే దివంగత వై ఎస్ రాజశేఖరరెడ్డి హయాంలో క్యాబినెట్ ర్యాంక్ మంత్రి పదవి నిర్వహించిన కొలుసు అది స్వీకరిస్తే చిన్నతనంగా ఉంటుందని భావించి విప్ పదవిని సున్నితంగా తిరస్కరించారు. దీనితో ఆ విప్ పదవిని జగ్గయ్యపేట ఎం ఎల్ ఏ సామినేని ఉదయభానుకు ఇచ్చారు. అనంతరం చీఫ్ విప్లకు క్యాబినెట్ ర్యాంక్, విప్లకు సహాయ మంత్రి హోదా కల్పిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది.
మంత్రి వర్గం లో స్థానం కల్పించలేని సీనియర్ నాయకులకు సమాన హోదా లో నామినేటెడ్ పదవులు కట్టబెట్టాలని జగన్ ఆలోచన చేశారు. అందులో భాగంగా రాష్ట్రం లోని 13 జిల్లాలను అయిదు ప్రాంతీయ మండళ్లుగా ఏర్పాటు చేసి చైర్మన్లుగా నియమించాలని భావించారు. ఈ ప్రాంత ప్రాంతీయ మండలి చైర్మన్ పదవి కొలుసు కి ఇవ్వాలని భావించినట్లు వార్తలు వచ్చాయి. అయితే ప్రాంతీయ మండళ్ల ఏర్పాటు ఆలస్యం అవుతున్న కారణంగా కొలుసుకు టిటిడి డైరెక్టర్ పదవి కేటాయించి ఊరడించే ప్రయత్నం జరిగింది. శ్రీవారి సేవలో తరించే పదవి కావడం వల్ల కొలుసు సమ్మతించే అవకాశం ఉంది.