ముంబాయి: బిజెపి ప్రభుత్వం అసెంబ్లీలో బలం నిరూపించుకోలేదని నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (ఎన్సిపి) అధినేత శరద్ పవార్, శివసేన అధినేత ఉద్ధవ్ ఠాక్రేలు పేర్కొన్నారు. మహారాష్ట్రలో తాజా రాజకీయ పరిణామాల నేపథ్యంలో శివసేన నేత ఉద్దవ్ ఠాక్రే, ఎన్సిపి నేత శరద్ పవార్లు సంయుక్త మీడియా సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా శరద్ పవార్ మాట్లాడుతూ ఎన్సిపి ఎప్పుడూ కూడా భారతీయ జనతా పార్టీతో చేతులు కలపదని స్పష్టం చేశారు. పార్టీలో ఏ ఒక్కరూ బిజెపి ప్రభుత్వానికి అనుకూలంగా లేరని అన్నారు. అజిత్ పవార్ క్రమశిక్షణా రాహిత్యానికి పాల్పడ్డారని మండిపడ్డారు. అజిత్ పవార్తో వెళ్లేవారు పార్టీ ఫిరాయిస్తే శాసనసభ సభ్యత్వం కూడా కోల్పోతారని గుర్తుంచుకోవాలని అన్నారు. శివసేన, కాంగ్రెస్, ఎన్సిపి నేతృత్వంలో ప్రభుత్వం ఏర్పాటు చేయాలని భావించామన్నారు. అజిత్ పవార్ నిర్ణయంతో ఎన్సిపిలో ఎవరూ సంతోషంగా లేరని పవార్ వ్యాఖ్యానించారు. అజిత్ వెంట 10-11 మంది ఎమ్మెల్యేలు మాత్రమే వెళ్లారని శరద్ పవార్ వెల్లడించారు. తమకు దాదాపు 170 మంది ఎమ్మెల్యేల బలం ఉందని తెలిపారు. అజిత్తో వెళ్లిన వారిలో ముగ్గురు ఎమ్మెల్యేలు వెనక్కు వచ్చారని చెప్పారు. బేరసారాలకు పాల్పడటం బిజెపికి అలవాటేనని పవార్ విమర్శించారు.
ఉద్ధవ్ ఠాక్రే మాట్లాడుతూ ప్రజాస్వామ్యాన్ని బిజెపి అపహాస్యం చేసిందని విమర్శించారు. ప్రజా తీర్పును అవమానించారని తమపైనే ఆరోపణలు చేస్తున్నారని అన్నారు. పాకిస్తాన్పై జరిగిన సర్జికల్ స్ట్రైక్ తరహా మహారాష్ట్రలో చేశారని ఉద్దవ్ విమర్శించారు.