న్యూస్ ఆర్బిట్ బ్యూరో)
ముంబై: మహారాష్ట్రలో బిజెపి నాయకత్వం రాత్రికి రాత్రి చక్రం తిప్పినట్లు పైకి కనబడుతున్నా నిజానికి అమిత్ షా చాలా రోజులనుంచీ తెర వెనుక నాటకం ఆడిస్తున్నారు. ప్రభుత్వం ఏర్పాటు చేసేది తామేనన్న భ్రమలో ఎన్సిపి, కాంగ్రెస్ నాయకత్వం ఎన్ని రోజులు మజా చేసుకుంటుందో చూద్దామన్నట్లు ఆయన తెర వెనుక ఉండిపోయారు. ఇక చాలు అనుకున్న తర్వాత పావులు కదిపారు. అటు ఎన్సిపి, ఇటు కాంగ్రెస్ నాయకత్వాలకు పరాభవం మిగిలింది.
అభిజ్ఞ వర్గాల సమాచారం ప్రకారం అమిత్ షా ముందు నుంచీ ఎన్సిపి లెజిస్లేచర్ పార్టీ నేత అజిత్ పవార్తో తన అనుచరుడి ద్వారా టచ్లో ఉన్నారు. తన నమ్మినబంటు, పార్టీ ప్రధాన కార్యదర్శి, మహారాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ భూపేందర్ యాదవ్ ద్వారా ఆయన వ్యవహారం అంతా నడిపించారు.
శరద్ పవార్, ఉద్దవ్ ధాక్రే, కాంగ్రెస్ నాయకుల మధ్య ప్రభుత్వం ఏర్పాటుపై ఒకపక్క చర్చలు జరుగుతుండగా మరోపక్క అత్యంత రహస్యంగా బిజెపి అజిత్ పవార్తో సంప్రదింపులు కొనసాగించింది. అయినా సరే శివసేనతో కలిసి ప్రభుత్వం ఏర్పాటుకు సిద్ధమేనన్న సంకేతాలు గత వారం చివరివరకూ పంపించారు. నిజానికి మాతోశ్ర్రీ నుంచి ఆదేశాలు అందుకునే పరిస్థితికి తలొగ్గే ప్రసక్తే లేదని అమిత్ షా తన సన్నిహిత సహచరులకు ముందే స్పష్టం చేశారు.
కాంగ్రెస్ వెనక్కుతగ్గుతుందేమో చూద్దామని బిజెపి వేచిచూసింది. శివసేన అయినా తెలివి తెచ్చుకుని సిద్ధాంతపరమైన యుటర్న్ నుంచి వెనక్కు మళ్లుతుందేమోనని కూడా చూశారు. మూడు పార్టీల మధ్యా అవగాహన కుదురుతున్న వాతావరణం కనబడేసరికి ఇక వేచిచూసే గేమ్కు స్వస్తి పలకాలని బిజెపి నాయకత్వం శుక్రవారం నిర్ణయించింది. శుక్రవారం సాయంత్రం భూపేందర్ యాదవ్ హుటాహుటిన ఢిల్లీ నుంచి ముంబై వచ్చారు. శనివారం ఉదయం 5:47 గంటలకు మహారాష్ట్రలో రాష్ట్రపతి పాలన రద్దు చేశారు. ఆ వెంటనే గవర్నర్ దేవేంద్ర ఫడ్నవీస్తో ప్రమాణ స్వీకారం చేయించారు. ఉప ముఖ్యమంత్రిగా అజిత్ పవార్తో ప్రమాణ స్వీకారం చేయించారు.
మొదట బిజెపికి అవకాశం ఇచ్చిన గవర్నర్ తర్వాత నవంబర్ 11న ఎన్సిపికి అవకాశం ఇచ్చారు. ప్రభుత్వం ఏర్పాటుకు కావాల్సిన మెజారిటీ తమకు కూడా లేదని నవంబర్ 12వ తేదీ మధ్యాహ్నం ఎన్సిపి నుంచి గవర్నర్కు లేఖ అందింది. ఆ వెంటనే గవర్నర్ కేంద్రప్రభుత్వానికి నివేదిక పంపారు. బ్రిక్స్ శిఖరాగ్ర సమావేశానికి బ్రెజిల్ వెళ్లాల్సిన ప్రధాని నరేంద్ర మోదీ చివరి నిముషంలో మంత్రివర్గ సమావేశం పెట్టి రాష్ట్రపతి పాలనకు సిఫారసు చేసి విమానం ఎక్కారు. ఎన్సిపి నుంచి గవర్నర్కు సకాలంలో లేఖ అందకపోతే ఇదంతా సాధ్యపడేది కాదు. ఆ లేఖ ఇచ్చింది ఎన్సిపి లెజిస్లేచర్ పార్టీ నాయకుడు అజిత్ పవార్. దీనిని బట్టి అజిత్ పవార్ ముందునుంచే బిజెపితో టచ్లో ఉన్నారని అనుకునేందుకు ఆస్కారం కలుగుతోంది.