(న్యూస్ ఆర్బిట్ బ్యూరో)
ఏడాది పైగా ఆలస్యంగా జాతీయ క్రయిం రికార్డుల బ్యూరో (ఎన్సిఆర్బి) సోమవారం దేశంలో నేరాలకు సంబంధించిన వివరాలు విడుదల చేసింది. అయితే అందులో మూక హత్యలకు సంబంధించిన డేటా లేదు. 2017 సంవత్సరానికి సంబంధించిన ఈ డేటాలో కొన్ని విభాగాల డేటాను తొలగించారనీ, ఎందుకు ఆ నిర్ణయం తీసుకున్నారో తెలియదనీ ఎన్సిఆర్బి అధికారి ఒకరు పేర్కొన్నట్లు ఇండియన్ ఎక్స్ప్రెస్ దినపత్రిక తెలిపింది.
ఐపిఎస్ అధికారి ఈష్కుమార్ ఎన్సిఆర్బి డైరక్టర్గా ఉండగా క్రయిం డేటా సేకరణ విధానాల్లో మార్పు తీసుకువచ్చారు. హత్య అనే క్యాటగిరీ కింద లించింగ్ (మూక హత్యలు), మతపరమైన కారణాలతో హత్య అనే ఉప విభాగాలు చేర్చారు. ఈ పద్ధతి కింద సేకరించిన డేటా విశ్లేషణ పూర్తయి విడుదలకు సిద్ధంగా ఉంది. మరి ఎందుకు విడుదల చేయలేదో అర్ధం కావడం లేదు అని ఎన్సిఆర్బి వర్గాలు పేర్కొన్నట్లు ఇండియన్ ఎక్స్ప్రెస్ తెలిపింది.
సోమవారం విడుదల అయిన డేటాను చూస్తే రాజ్యానికి వ్యతిరేకంగా జరిగిన నేరాలలో 2016తో పోల్చుకుంటే 30 శాతం పెరుగుదల కనబడుతోంది. గత సంవత్సరం ఈ తరహా నేరాలు 6986 జరగగా, 2017లో 9013 సంభవించాయి. రాజద్రోహం, రాజ్యంపై యుద్ధానికి దిగడం, ప్రభుత్వ ఆస్థులను ధ్వంసం చేయడం వంటి నేరాలు ఈ క్యాటగిరీ కిందకు వస్తాయి. ఈ నేరాలు ఉత్తరప్రదేశ్, హర్యానా రాష్ట్రాల నుంచి ఎక్కువ రిపోర్టు అయ్యాయి. అయితే వాటిలో ప్రభుత్వ ఆస్థులను ధ్వంసం చేయడమే ఎక్కువ భాగం.
రాజద్రోహం కేసులు అత్యధికంగా అస్సాం (19) నుంచీ, హర్యానా (13) నుంచీ రిపోర్టు అయ్యాయి. జమ్ము కశ్మీర్లో ఒక్క రాజద్రోహం కేసే నమోదయింది.
జాతి వ్యతిరేక శక్తుల నేరాలు అనే కొత్త క్యాటగిరీ కింద నమోదయిన నేరాల్లో ఎక్కువ భాగం వామపక్ష తీవ్రవాదులవే. వారిపై 652 కేసులు నమోదు కాగా, ఈశాన్య ప్రాంతాల తిరుగుబాటుదారుల నేరాలు 421, జిహాదీల వంటి ఉగ్రవాదుల నేరాలు 371 నమోదయ్యాయి. ఈ క్యాటగిరీలో ఎక్కువ హత్యలు చేసింది కూడా వామపక్ష తీవ్రవాదులే. ఆ హత్యలు మొత్తం 82 కాగా వాటిలో 72 హత్యలు ఒక్క ఛత్తీస్గఢ్ రాష్ట్రంలోనే జరిగాయి.