న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన నిర్భయ కేసు నిందితుల్లో ఒకడైన అక్షయ్ సింగ్ సుప్రీంకోర్టులో వేసిన రివ్యూ పిటిషన్ విచారణ ధర్మాసనం నుంచి చీఫ్ జస్టిస్ ఎస్ఏ బొబ్డే తప్పుకున్నారు. ఈ మేరకు మంగళవారం ఆయన సంచలన ప్రకటన చేశారు. బుధవారం కొత్త ధర్మాసం ఈ పిటిషన్ ను విచారించనుంది. రివ్యూ పిటిషన్ కు వ్యతిరేకంగా నిర్భయ తల్లి తరపున చీఫ్ జస్టిస్ బాబ్డే కోడలు వాదిస్తున్నారు. ఈ నేపథ్యంలో తన కోడలు వాదిస్తున్న కేసులో తాను తీర్పును వెలువరించలేదని ఆయన తెలిపారు. ధర్మాసనం నుంచి తాను తప్పుకుంటున్నానని చెప్పారు. బుధవారం మరో ధర్మాసనం విచారణ చేపడుతుందని తెలిపారు. విచారణ పారదర్శకంగా జరగాలనే ఉద్దేశంతోనే తాను ఈ నిర్ణయం తీసుకున్నట్టు చెప్పారు.
రివ్యూ పిటిషన్ను సుప్రీంకోర్టు తిరస్కరిస్తుందని ఆశిస్తున్నట్టు నిర్భయ తల్లి పేర్కొన్నారు. తమ కుటుంబానికి సాధ్యమైనంత వేగంగా న్యాయం చేయాలని ఆమె కోరారు. ‘కోర్టు తప్ప మాకు వేరే ఆధారం లేదు కాబట్టి మాకు న్యాయం జరుగుతుందని నమ్ముతున్నాం. అక్షయ్ పిటిషన్ను సుప్రీంకోర్టు తిరస్కరిస్తుందని నేను ఆశిస్తున్నాను. న్యాయం కోసం ఏడేళ్లుగా ఎదురు చూస్తున్నాం. ఇంకా ఒక్క రోజు వేచి ఉంటా. ఈ కేసును సాగదీసేందుకే వారు సుప్రీంకోర్టును ఆశ్రయించారు’ అని ఆమె పేర్కొన్నారు
నిర్భయ కేసు దోషుల్లో ఒకడైన అక్షయ్ కుమార్ సింగ్ తనకు విధించిన ఉరిశిక్షను పునఃసమీక్షించాలని కోరుతూ సుప్రీంకోర్టులో రివ్యూ పిటిషన్ దాఖలు చేసిన సంగతి తెలిసిందే. ‘ఢిల్లీలో వాయు,నీటి కాలుష్యం వల్ల ఎలాగూ జీవితం హరించుకుపోతున్నది. ఇక ఉరిశిక్షలు ఎందుకు?’ అని అక్షయ్ తన పిటిషన్ లో ప్రశ్నించారు. అయితే ఈ రివ్యూ పిటిషన్ ను నిర్భయ తల్లిదండ్రులు వ్యతిరేకించారు. అక్షయ్ రివ్యూ పిటిషన్లో ఇంప్లీడ్ అయ్యేందుకు అనుమతి ఇవ్వాలని నిర్భయ తల్లి ఆశా దేవీ గతవారం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. ఇంప్లీడ్ పిటిషన్ వేసేందుకు సీజేఐ ఎస్ఏ బొబ్డే అనుమతించారు.
2012లో నిర్భయపై కదులుతున్న బస్సులో ఆరుగురు గ్యాంగ్ రేప్ కు పాల్పడిన సంగతి తెలిసిందే. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ 13రోజుల పాటు పోరాడిన నిర్భయ చివరకు ప్రాణాలు విడిచింది. ఈ కేసులో మొత్తం ఆరుగుర్ని దోషులుగా గుర్తించగా… వారిలో ఒకడు తీహార్ జైల్లో ఆత్మహత్య చేసుకున్నాడు. మరొక వ్యక్తి మైనర్ కావడంతో… జువెనైల్ చట్టాల ప్రకారం మూడేళ్ల జైలు శిక్ష తర్వాత విడుదల అయ్యాడు. ఇక మిగతా నలుగురూ తీహార్ జైల్లో ఉన్నారు. వాళ్లు క్షమాబిక్ష పిటిషన్ పెట్టుకోవడంతో శిక్ష అమలు కాలేదు. ఇటీవల రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ వారి క్షమాబిక్ష పిటిషన్ను తిరస్కరించడంతో వారికి ఉరిశిక్ష విధించే అవకాశం ఉందని ప్రచారం జరుగుతోంది.