పొరుగుదేశంతో తీవ్ర ఉద్రిక్తతల మధ్య యధావిధిగా రానున్న ఎన్నికలకు పార్టీని సిద్ధం చేసే కార్యక్రమాలలో తలమునకలవుతున్నందుకు ప్రధానిపై ప్రతిపక్షాలు తీవ్రంగా మండిపడుతున్నాయి.
నిన్న కూడా ముందే నిర్ణయించిన రోజువారీ కార్యక్రమాలకు హజరయిన మోదీ ఈ రోజు ‘మేరా బూత్ సబ్సె మజ్బూత్’ అనే బిజెపి కార్యక్రమానికి హాజరయ్యారు. దేశవ్యాప్తంగా బిజెపి కార్యకర్తలతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సంభాషించడం ఈ కార్యక్రమం ఉద్దేశం. అందులో తన ధోరణిలో ఆయన ప్రతిపక్షాలను తెగనాడారు.
సైనికుల త్యాగాలను బిజెపి నాయకత్వం రాజకీయ ప్రయోజనాలకు వాడుకుంటున్నదని ప్రతిపక్షాలు విమర్శించాయి. ఈ పార్టీ కార్యక్రమం గురించి నిన్న బిజెపి ట్వీట్ చేసిన దగ్గరనుంచీ ఆ పార్టీపై ఆన్లైన్ విమర్శలు వచ్చిపడుతూనే ఉన్నాయి.
జైషె మొహమ్మద్ శిక్షణా శిబిరంపై దాడి వల్ల మోదీపై ప్రజాభిమానం వెల్లువెత్తుతున్నదనీ, ఆ కారణంగా కర్నాటకలలోని 28 సీట్లలో 22 బిజెపి గెలుచుకుంటుందనీ యడ్యూరప్ప ప్రకటించడంతో ప్రతిపక్షాలకు మరింత మండింది. ఉద్రిక్తతల కారణంగా వర్కింగ్ కమిటీ సమావేశాన్ని వాయిదా వేసుకున్న కాంగ్రెస్ పార్టీ బిజెపి సీట్లు లెక్క పెట్టుకుంటున్నదని ఎద్దేవా చేసింది.
పాక్తో ఉద్రిక్తతల కారణంగా తన నిరాహార దీక్షను వాయిదా వేసుకున్న ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ బిజెపి నాయకత్వానికి మంచి చెప్పే ప్రయత్నం చేసారు. బిఎస్పి నేత మాయావతి, సమాజ్వాదీ పార్టీ నేత అఖిలేష్ యాదవ్ కూడా బిజెపి వైఖరిని విమర్శించారు.