న్యూఢిల్లీ: అంతర్జాతీయ న్యాయస్థానం (ఐసిజె) ఆదేశాల మేరకు పాకిస్థాన్లోని భారత దౌత్యాధికారులు నౌకాదళ విశ్రాంత అధికారి కుల్భూషణ్ జాదవ్ను శుక్రవారం కలిసేందుకు ఆ దేశం అనుమతి ఇచ్చింది. పది రోజుల క్రితం అంతర్జాతీయ న్యాయస్థానం ఇచ్చిన ఆదేశాల మేరకు పాకిస్థాన్ ఈ నిర్ణయం తీసుకున్నది. దీనిపై భారత ప్రభుత్వం స్పందించాల్సి ఉన్నది. ఈ సాయంత్రం విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ దీనిపై మీడియాతో మాట్లాడనున్నట్లు సమాచారం.
పాక్ సైనికులు 2016లో జాదవ్ ను అరెస్టు చేశారు. అతనిపై గూఢచర్యం ఆరోపణ మోపారు. దీనిపై విచారణ జరిపిన అక్కడి సైనిక కోర్టు 2017లో ఏప్రిల్లో ఆయనకు మరణశిక్ష విధించింది. జాదవ్ ఉగ్రవాద కార్యకలాపాలకు, గూఢచర్యానికి పాల్పడ్డారని పాకిస్తాన్ ఆరోపణ చేయగా ఆ ఆరోపణలను భారత్ ఖండించింది. ఉద్యోగ విరమణ అనంతరం జాదవ్ ఇరాన్లో వ్యాపారం చేసుకుంటుండగా అపహరణకు గురయ్యాడని పేర్కొంది. దీనిపై భారత్ అంతర్జాతీయ న్యాయస్థానాన్ని ఆశ్రయించగా పాక్ సైనిక కోర్టు ఇచ్చిన మరణశిక్షను తాత్కిలికంగా నిలుపుదల చేస్తూ అంతర్జాతీయ న్యాయస్థానం జూలై 18న ఆదేశాలు ఇచ్చింది. కొద్ది రోజుల క్రితం ఐసిజెలో జరిగిన విచారణలో ఇరుపక్షాల వాదనలు విన్న న్యాయస్థానం పాక్ తీరుపై ఆగ్రహం వ్యక్తం చేసింది. అతనికి న్యాయ సహాయం అందేలా చూడాలని ఆదేశించింది.
previous post
next post