చిత్తూరు, మార్చి 3: ఎన్జివోలు పాలనా వ్యవస్థలో భాగం కావాలని జనసేనాని పవన్ కళ్యాణ్ అన్నారు. చిత్తూరు జిల్లా పర్యటనలో భాగంగా రెండవ రోజు ఆదివారం జనసేన అధినేత పవన్ కళ్యాణ్ బ్యాన్స్ హోటల్లో స్వచ్చంద సంస్థల ప్రతినిధులతో సమావేశం నిర్వహించారు. వారి నుండి సమస్యలను, సూచనలు అడిగి తెలుసుకున్నారు.
కులాలకు, మతాలకు అతీతంగా స్వచ్చంద సంస్థల ప్రతినిధులు సేవా కార్యక్రమాలు నిర్వహిస్తుంటారని కొనియాడారు. రాజకీయ నాయకులు అవినీతిపరులు మారే అవకాశం ఉందని పవన్ అన్నారు. కానీ స్వచ్చంద సంస్థల ప్రతినిధులు ఎటువంటి స్వలాభాపేక్ష లేకుండా సమాజ సేవే లక్ష్యంగా పని చేస్తున్నాయని పేర్కొంటూ జనసేన అధికారంలోకి వస్తే స్వచ్చంద సంస్థల కార్యాలయాల ఏర్పాటుకు ప్రభుత్వ స్థలాలను కేటాయిస్తామనీ. ఈ అంశాన్ని పార్టీ మానిఫెస్టోలో పెట్టనున్నట్లు పవన్ కళ్యాణ్ తెలిపారు.
తాను సమాజంలో మార్పు కోసమే రాజకీయాల్లో వచ్చానని పేర్కొన్నారు. మార్పు కోసం చేస్తున్న ఈ ప్రయత్నంలో స్వచ్చంద సంస్థలు తోడ్పాటు అందించాలని పవన్ కోరారు. పార్టీలో చేరమని తాను కోరడం లేదని పవన్ అన్నారు.
సహకార సంఘాల బలోపేతం కోసం జనసేన కృషి చేస్తుందని చెప్పారు.
రాష్ట్రంలో సంపద మొత్తం దుర్వినియోగం అవుతోందని ఆవేదన వ్యక్తం చేశారు.
మూసివేసిన జూట్ మిల్ ఆస్తులను కాపాడతామనీ, వాటి పూర్వ వైభవానికి కృషి చేస్తామని పవన్ తెలిపారు.
మైనింగ్ పాలసీ తీసుకువస్తామని పవన్ పేర్కొన్నారు.
సమాజంలో కులల తాలూకు జాడ్యం బాగా పెరిగిపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. పేద రికం అన్ని కులాల్లో ఉందని పవన్ అన్నారు. కొన్ని కుటుంబాల చేతిలోనే రాజకీయ ఆధిపత్యం కొనసాగడం వల్ల అట్టడుగు వర్గాలకు న్యాయం జరగడం లేదని పవన్ అన్నారు.
జనసేన గెలుపు కోసం కాదు, సమాజంలో మార్పు కోసం కృషి చేస్తుందని పవన్ స్పష్టం చేశారు.
ఓటు ఎవరికి వేసినా పాలకులు అందరికీ సమానంగా సంక్షేమ పథకాలు అందించాల్సి ఉంటుందని పవన్ తెలిపారు. తన పర్యటనలో మేధావులు, స్వచ్చంద సంస్థల ప్రతినిధులు, విద్యార్థులు, మహిళలు తదితర వర్గాలతో ముఖాముఖీ కార్యక్రమాల్లో వచ్చిన అంశాలను చర్చించి పార్టీ మానిఫెస్టోలో ప్రవేశపెడతామని పవన్ తెలిపారు.
ఈ కార్యక్రమంలో ఆ పార్టీ రాష్ట్ర నేత నాదెండ్ల మనోహర్ తదితరులు పాల్గొన్నారు.
అనంతరం గంగాధర నెల్లూరు, పుత్తూరు మీదుగా రోడ్ షో కొనసాగింది. సాయంత్రం రేణిగుంట, ఏర్పేడు, శ్రీకాళహస్తి, నాయుడుపేట రోడ్షోలో పాల్గొని ప్రసంగిస్తారు.