కోల్ కతా: ప్రధానమంత్రి నరేంద్రమోదీపై పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ కలకత్తా కాళికలా విరుచుకుపడ్డారు. మాట్లాడితే నోటి వెంట నిప్పుల వర్షం కురిపించే మమత.. అదే స్థాయిలో ప్రధాని మీద విమర్శలు గుప్పించారు. 2002లో నరేంద్రమోదీ గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు జరిగిన ఘటనలను ప్రస్తావిస్తూ ఆమె తీవ్రస్థాయిలో దునుమాడారు. పశ్చిమబెంగాల్ రాష్ట్రంలో ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్న సందర్భంగా ప్రధానమంత్రి మోదీ మమతా బెనర్జీ మూడు ‘టి’లకు బాగా ప్రసిద్ధి అని విమర్శించారు. అవి.. తృణమూల్, తోలాబాజీ, టాక్స్ అన్నారు. తోలాబాజీ అంటే బెంగాలీలో బాగా దురర్ధం వచ్చే తిట్టులాంటిది. వ్యవస్థీకృతమైన దోపిడీ అనే అర్థం వచ్చేలా ఆ తిట్టు ఉంటుంది. దానికి మమతా బెనర్జీ దీటుగా స్పందించారు.
‘‘దేశం కోసం ప్రాణాలు అర్పించిన వ్యక్తులను మనం గౌరవించాలి. నిన్న మీరు రాజీవ్ గాంధీని అవినీతిపరుడని విమర్శించారు. ఈరోజు నన్ను తోలాబాజ్ అన్నారు. నేను తోలాబాజ్ అయితే మీరేంటి? మీరేంటి? మీ శరీరం మొత్తం.. తల నుంచి కాళ్ల వరకు ప్రజల రక్తంతో తడిసిపోయింది. మీ చరిత్ర అంతా కేవలం మతఘర్షణలు.. మత ఘర్షణలు.. మతఘర్షణలే’’ అని బిష్ణుపూర్ లో జరిగిన ఎన్నికల ర్యాలీలో ఆమె తీవ్రంగా విరుచుకుపడ్డారు.
మమతా బెనర్జీ, నరేంద్రమోదీల మధ్య సంబంధాలు అత్యంత దారుణంగా ఉంటాయి. ఫొని తుపాను నేపథ్యంలో అవి మరింతగా బయటపడ్డాయి. మమతా బెనర్జీ అవినీతిలో కూరుకుపోయారని, రాష్ట్రంలో రాజకీయ హింస పెచ్చరిల్లిందని మోదీ విమర్శిస్తే, బీజేపీ మత రాజకీయాలు చేస్తూ ఓట్లు పొందే ప్రయత్నంలో పడిందని మమత ఆరోపించారు. గుజరాత్ అల్లర్లలో దాదాపు 2వేల మంది మరణించారని, వారిలో అత్యధికులు ముస్లింలేనని మానవహక్కుల సంఘాలు చెబుతాయి. ఆ సమయంలో మోదీ గుజరాత్ సీఎంగా ఉండేవారు. కానీ ఆయనను విచారించేందుకు సాక్ష్యాలు ఏమీ లేవని కోర్టు నియమించిన విచారణ బృందం తెలిపింది.