(న్యూస్ ఆర్బిట్ డెస్క్)
ఇటీవల సోషల్ మీడియాలో ఒక పోస్టు హల్చల్ చేస్తోంది. ప్రపంచ బ్యాంక్ దగ్గర ఇండియా తీసుకున్న రుణం మొత్తాన్నీ ప్రధాని నరేంద్ర మోదీ గత ఆరేళ్లలో పూర్తిగా తీర్చారన్నది ఆ పోస్టు సారాంశం.
పూర్తి మెసేజ్ చెప్పేదేమంటే: ‘గత 70 ఏళ్లుగా ప్రపంచ బ్యాంక్ దగ్గర ఇండియా ఎక్కువ రుణాలు తీసుకుంటున్నది. ఒకప్పుడు పుట్టిన ప్రతి భారతీయుడూ అప్పుతోనే పుట్టాడు. పెద్ద పెద్ద ఆర్ధికవేత్తలు చేయలేని పని ఒక చాయ్వాలా చేసి చూపించాడు. గత ఆరేళ్లలో ప్రపంచ బ్యాంక్ అప్పు మొత్తం తీర్చిపారేశారు. యుఎన్లో ఫుల్ సెటిల్మెంట్ చేసేశారు. ఇండియాలో ఆర్ధిక మాంద్యం ఉందని ఎవరా అంటున్నది’.
ఐక్యరాజ్యసమితిలో భారత ప్రతినిధి సయ్యద్ అక్బరుద్దీన్ చేసిన ఒక ట్వీట్ స్క్రీన్ షాట్ను ఉపయోగించి ఈ క్లెయిమును ప్రచారంలో పెడుతున్నారు.
For 70 years India was the biggest borrower at the world Bank, once every Indian born was a debtor, the things which great economists couldn't do, a chaiwala did it, he changed India's & Indian's fate, @narendramodi did it in just 6 years as PM #UNLoanCleared #ModiHaiToMumkinHai pic.twitter.com/ZYGZ6VBasS
— Manojava Gururaj Galgali (@ManojavG) October 11, 2019
ఈ క్లెయిముల్లో వాస్తవం ఎంతో చూడాల్సిందిగా చాలామంది ఆల్ట్న్యూస్ను కోరారు.
వీటిల్లో చాలావరకూ నిజాలు కావు.
అక్బరుదీన్ ట్వీట్ ప్రపంచబ్యాంక్కు సంబంధించినది కాదు. ఐక్యరాజ్య సమితికు ఇండియా చేయాల్సిన చెల్లింపులకు సంబంధించినది. అక్బరుద్దీన్ అక్టోబర్ 11న చేసిన ట్వీట్ ఈ కింద చూడండి. చెల్లింపులు ఐక్యరాజ్యసమితికని స్పష్టంగా ఉంది.
అదే రోజు ఐక్యరాజ్యసమితి ఆర్ధిక పరిస్థితిపై ఒక నివేదిక వచ్చింది. దానిని కూడా అక్బరుద్దీన్ ట్వీట్ చేశారు. అక్టోబర్ 11 నాటికి సమితికి అన్ని బకాయిలూ చెల్లించిన దేశాల జాబితా అందులో ఉంది.
సమితి ప్రతి రెండేళ్లకూ ఈ నివేదిక విడుదల చేస్తుంది. సమితికి జరిపే చెల్లింపులు బకాయిలు కావు. సమితి నిర్వహణ కోసం దాని 193 సభ్యదేశాలూ కొంత డబ్బు చెల్లిస్తాయి. ఆ చెల్లింపుల గురించి అక్బరుద్దీన్ ట్వీట్ చేశారు.
ఐక్యరాజ్యసమితి ప్రస్తుతం లోటుతో నడుస్తోంది. సమితి బడ్జెట్లో 70 శాతం నిధులు మాత్రమే సభ్యదేశాల నుంచి అందాయని సమితి సెక్రటరీ జనరల్ యాంటోనియో గుటెరస్ ఇటీవల ప్రకటించారు.
సమితి సంగతి ఇలా ఉంటే, ప్రపంచబ్యాంక్కు ఇండియా మొత్తం చెల్లింపులు జరిపిందన్న మాట అవాస్తవం. ప్రపంచ బ్యాంక్ సమాచారం ప్రకారం 2019లో ఇండియాకు మొత్తం 327.7 కోట్ల డాలర్ల మేర రుణసహాయం వాగ్దానం చేశారు (ప్రపంచబ్యాంక్లో భాగమైన ఐబిఆర్డి, ఐడిఎ ఇస్తున్న రుణాలతో కలిసి). 2015 నుంచీ ప్రపంచబ్యాంక్ ఇండియాకు వాగ్దానం చేసి ఆ ప్రకారం అందిస్తున్న రుణసహాయం డేటా కింద చూడండి.
2014 నుంచి ఇప్పటివరకూ నడుస్తున్న 21 ప్రాజెక్టులకు సంబంధించి ఇండియా ఐడిఎకు ఇంకా 110 కోట్ల డాలర్లు చెల్లించాల్సిఉంది. మరో 11 ప్రాజెక్టులకు సంబంధించి ఇండియా ఐబిఆర్డికి 230 కోట్ల డాలర్లకు పైగా చెల్లించాల్సిఉంది. ఈ 11 ప్రాజెక్టుల్లో తొమ్మిది యుపిఎ హయాంలో ప్రారంభమయినవి.
2014 మే 24 తర్వాత (మోదీ ప్రధాని పదవి స్వీకరించిన తర్వాత) ఇండియాలో 88 ప్రాజెక్టులకు రుణ సహాయం అందించేందుకు ప్రపంచబ్యాంక్ సంసిద్ధత తెలిపింది. వాటిలో చాలావరకూ పూర్తయ్యాయి. కొన్ని ఇంకా నడుస్తున్నాయి. కొన్ని రద్దయ్యాయి. ప్రపంచబ్యాంక్లో భాగమైన ఐబిఆర్డి తాజాగా ఒదిషాలో వ్యవసాయం – నీటిపారుదల రంగానికి సంబంధించిన ఒక ప్రాజెక్టుకు 16.5 కోట్ల డాలర్ల మేర సహాయం వాగ్దానం చేసింది. దీనికి సంబంధించిన ఒప్పందంపై ఇంకా సంతకాలు కావాల్సిఉంది.
పై సమాచారం నరేంద్ర మోదీ వచ్చి ప్రపంచబ్యాంక్ అప్పులన్నీ తీర్చారాన్న మాట నిజం కాదని స్పష్టం చేస్తున్నది. 2016లో ప్రపంచబ్యాంక్ ఒక నివేదిక విడుదల చేసింది. స్వాతంత్ర్యానంతరం ప్రపంచబ్యాంక్ నుంచి అత్యధికంగా రుణసహాయం పొందిన దేశాల్లో ఇండియా మొదటిస్థానంలో ఉందని ఆ నివేదికలో తెలిపారు.
అభివృద్ధి చెందుతున్న దేశంగా ఇండియా ఇప్పటికీ వివిధ అభివృద్ధి ప్రాజెక్టుల అమలుకు ప్రపంచబ్యాంక్ ఆర్ధిక సహాయంపై ఆధారపడుతున్నది. ఈ రుణాల చెల్లింపులకు ఒక పద్ధతి, కాలపరిమితి ఉంటాయి కాబట్టి చాలా రుణాలు ఇంకా తీర్చాల్సినవి ఉన్నాయి. ఉదాహరణకు బీహార్లో ఉపాధ్యాయుల సమర్ధతను పెంచే ఒక ప్రాజెక్టుకు ప్రపంచబ్యాంక్ సహాయం ఒప్పందంపై 2015లో సంతకాలు జరిగాయి. ఈ ప్రాజెక్టు 2020 జూన్ వరకూ అమలవుతుంది. ఈ రుణం తీర్చడానికి ఇండియాకు 2040 వరకూ వ్యవధి ఉంది.
‘ఆల్ట్న్యూస్‘ వెబ్సైట్ సౌజన్యంతో