హైదరాబాద్: రెండు రోజుల క్రితం జరిగిన ప్రగతి భవన్ ముట్టడి కార్యక్రమంలో పోలీసుల కళ్లుగప్పి బైక్ పై వచ్చిన కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డిపై పోలీసులు నాన్ బెయిలబుల్ క్రిమినల్ కేసు నమోదు చేశారు. పోలీసుల విధులకు ఆటంకం కలిగించారని, విధి నిర్వహణలో ఉన్న పోలీసు అధికారితో దురుసుగా ప్రవర్తించడమే కాకుండా, ఆయన్ని తోసివేశారన్న అభియోగాలతో జూబ్లీహిల్స్ పోలీసు స్టేషన్ లో కేసు రిజిస్టర్ అయింది.
ఆర్టీసీ కార్మికుల సమ్మెకు మద్దతుగా సోమవారం ప్రగతి భవన్ ముట్టడి నేపథ్యంలో జూబ్లీహిల్స్ లోని రేవంత్రెడ్డి నివాసం వద్ద తెల్లవారుజాము నుంచే జూబ్లీహిల్స్ పోలీసులు భారీ పోలీసు బందోబస్తు ఏర్పాటు చేసి ఆయనను హౌజ్ అరెస్ట్ చేశారు. బంజారాహిల్స్ ఏసీపీ కే.ఎస్.రావు, జూబ్లీహిల్స్ ఇన్ స్పెక్టర్ కె.బాలకృష్ణారెడ్డి, సెక్టార్ ఎస్ఐ నవీన్ రెడ్డి తదితరులు ఆయన ఇంటి వద్ద బందోబస్తు ఏర్పాటు చేసి ఆయన బయటకు రాకుండా కట్టడి చేశారు. అయితే మధ్యాహ్నం 12 గంటల సమయంలో రేవంత్రెడ్డి పోలీసు ఆదేశాలను బేఖాతరు చేస్తూ అనుచరులతో కలిసి అతివేగంగా ఇంట్లో నుంచి బయటకు దూసుకొచ్చారు. ఆ సమయంలో అడ్డుకున్న ఎస్ఐ నవీన్ రెడ్డితో పాటు పలువురు పోలీసులను నెట్టుకుంటూ, పక్కకు తోసేస్తూ అప్పటికే సిద్ధంగా ఉన్న బైక్పై దూసుకుపోయారు. పోలీసులు అప్రమత్తమై చాలాదూరం చేజ్ చేసుకుంటూ వెళ్లినా అప్పటికే రేవంత్రెడ్డి ప్రగతి భవన్ కు చేరుకున్నారు. ఈ ఘటనలో ఎస్ఐ నవీన్ రెడ్డికి గాయాలయ్యాయి. మిగతా పోలీసులను కూడా నెట్టుకుంటూ వెళ్లడంతో వారు ఇబ్బందులు పడ్డారు. ఈ నేపథ్యంలోనే ఎస్ఐ నవీన్ రెడ్డి పోలీసు విధులకు ఆటంకం కలిగించిన రేవంత్రెడ్డిపై ఫిర్యాదు చేయగా ఆయనపై ఐపీసీ సెక్షన్ 341, 332తో పాటు 353 కింద నాన్ బెయిలబుల్ సెక్షన్ ను నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఘటనలకు సంబంధించిన వీడియో సాక్ష్యాలను పరిశీలిస్తున్నారు.
@revanth_anumula escapes from house arrest on bike to participate in Seize of Pragathi Bhavan. Congress gave call for protest in support of striking #TSRTC staff. pic.twitter.com/5TGXy4k3y1
— CharanTeja (@CharanT16) October 21, 2019