(న్యూస్ ఆర్బిట్ డెస్క్)
అమరావతి: సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి సారథ్యంలోని వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం మరో సంచలనాత్మక నిర్ణయాన్ని తీసుకుంది. నిరుద్యోగులకు ఆర్థిక స్వావలంబనను కల్పించే దిశగా చర్యలు తీసుకుంది. ‘వైఎస్సార్ ఆదర్శం’ పేరుతో సరికొత్త పథకానికి శ్రీకారం చుట్టింది. ఇసుక, నిత్యావసర సరుకులు, మద్యం బాటిళ్ల రవాణా బాధ్యతలను నిరుద్యోగులకు అప్పగించబోతోంది. దీనికి అవసరమైన వాహన సదుపాయాన్ని ప్రభుత్వమే కల్పించనుంది. దీనికోసం 6000 ట్రక్కులను కొనుగోలు చేయడానికి అవసరమైన ఆర్థిక సహకారాన్ని ప్రభుత్వమే అందించబోతోంది. ఈ పథకానికి వైఎస్సార్ ఆదర్శం అని పేరు పెట్టింది.
‘వైఎస్సార్ ఆదర్శం’ పథకం కింద ద్వారా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ, కాపు సామాజిక వర్గానికి చెందిన నిరుద్యోగులకు ఈ అవకాశాన్ని కల్పించింది. ఆయా సామాజిక వర్గాలకు ఆర్థిక సహాయాన్ని అందించడానికి ఏర్పాటు చేసిన కార్పొరేషన్ల ద్వారా ఫైనాన్స్ సౌకర్యాన్ని ప్రభుత్వం కల్పిస్తుంది. దీనికి సంబంధించిన విధి విధానాలు, మార్గదర్శకాలను ప్రభుత్వం మంగళవారం విడుదల చేసింది. ఈ మేరకు సాంఘిక సంక్షేమ శాఖ కార్యదర్శి ముద్దాడ రవిచంద్ర ఉత్తర్వులను జారీ చేశారు. అగ్ర వర్ణ నిరుద్యోగులకు ఈ పథకం వర్తించదు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ, కాపులకు మాత్రమే వర్తించేలా దీన్ని రూపొందించింది ప్రభుత్వం.
రాష్ట్రవ్యాప్తంగా రీచ్ ల నుంచి కొనుగోలుదారుల ఇళ్ల వద్దకు ఇసుకను తరలించే బాధ్యతను ప్రభుత్వం నిరుద్యోగ యువతకు అప్పగించనుంది. ఏపీ బేవరేజెస్ కార్పొరేషన్ గోడౌన్ల నుంచి మద్యం బాటిళ్లను ప్రభుత్వ ఆధీనంలోని దుకాణాలకు చేరవేయడం, పౌర సరఫరాల సంస్థ గిడ్డంగుల నుంచి బియ్యం, ఇతర నిత్యావసర సరుకులను మండల స్థాయి పాయింట్ (ఎంఎస్ఎల్) వరకు రవాణా చేసే పనులన్నీ యువతకు దక్కబోతున్నాయి. ఆయా సామాగ్రిని రవాణా చేయడానికి 6000 ట్రక్కులను ప్రభుత్వం కొనుగోలు చేయడానికి అర్హులైన నిరుద్యోగులకు అవసరమైన ఆర్థిక సహాయాన్ని ప్రభుత్వం సమకూర్చుతుంది.
ప్రతినెలా కనీసం 20 వేల రూపాయల ఆదాయాన్ని ఆర్జించేలా ఈ పథకానికి రూపకల్పన చేసింది. కార్పొరేషన్ల ద్వారా ట్రక్కులు, రవాణా వాహనాల కొనుగోలుకు రుణ మంజూరుతో పాటు ఇసుక రవాణా, పౌరసరఫరాల శాఖతో సహా ప్రభుత్వం వినియోగించే ప్రతి రవాణా ప్రక్రియలో స్వయం ఉపాధి కల్పించడానికి కేబినెట్ ఆమోదించిన విషయం తెలిసిందే. ట్రక్కుల కొనుగోలుకు బ్యాంకులు తమ సొంత పూచీకత్తుతో ఎంపికైన నిరుద్యోగులకు రుణాలను అందించాల్సి ఉంటుందని ప్రభుత్వం మార్గదర్శకాల్లో స్పష్టం చేసింది. బ్యాంకు లింకేజీ తప్పనిసరి చేసింది.
వైఎస్సార్ ఆదర్శం పథకాన్ని పకడ్బందీగా అమలు చేయడానికి రాష్ట్రం, జిల్లా స్థాయిలో కమిటీలను ఏర్పాటు చేసింది. సాంఘిక సంక్షేమ శాఖ కార్యదర్శి ఛైర్మన్ గా వ్యవహరించే రాష్ట్ర స్థాయి కమిటీలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ, కాపు కార్పొరేషన్ల కార్యదర్శులు, గనులు, పౌర సరఫరాల శాఖ కార్యదర్శులు, రవాణా, వాణిజ్య పన్నుల శాఖల కమిషనర్లు, రాష్ట్రస్థాయి బ్యాంకర్ల కమిటీ కన్వీనర్ సభ్యులుగా, ఖనిజాభివృద్ధి సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ సమన్వయకుడిగా ఉంటారు. కలెక్టర్ ఛైర్మన్ గా ఉండే జిల్లా స్థాయి కమిటీలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ, కాపు కార్పొరేషన్ల ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్లు, గనుల శాఖ అదనపు డైరెక్టర్, జిల్లా గిరిజన సంక్షేమ శాఖ అధికారి, జిల్లా రవాణా కమిషనర్, లీడ్ బ్యాంకు జిల్లా మేనేజర్ సభ్యులుగా, సంయుక్త కలెక్టర్ కన్వీనర్ గా ఉంటారు.