కృష్ణానది వరదతో పొంగుతుండగా ఒడ్డున ఉన్న మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు ఇల్లు రాజకీయాల్లో మునుగుతోంది. అధికారపక్షం శాసనసభ్యులు, మంత్రులు కలిసి టిడిపి అధినేత ఇల్లు మునుగుతున్నదని నిరూపించేందుకు నానాతిప్పలూ పడుతున్నారు.
ఆందోళనకరమైన విషయం ఏమంటే చంద్రబాబు ఇల్లును ముందుగానే ముంచేందుకు ప్రకాశం బరాజ్ దగ్గర గరిష్టమట్టం కన్నా ఎక్కువగా నీరు నిల్వ ఉంచినట్లు మీడియా రిపోర్టు చేస్తున్నది. ప్రకాశం బరాజ్ వద్ద గరిష్ట నిల్వ మట్టం 13 అడుగులు కాగా 15 అడుగుల వరకూ ఉంచారని వినబడుతున్నది. అదే నిజమైతే వైసిపి ప్రభుత్వం క్షమించరాని తప్పు చేస్తున్నట్లే లెఖ్క.
వరద నిర్వహణ సక్రమంగా లేదంటూ సర్కారును ప్రతిపక్షమైన టిడిపి విమర్శిస్తున్నది. చంద్రబాబు ఇంటిపై డ్రోన్ తిరిగిన తర్వాత ఈ విమర్శల పదును పెరిగింది. వరదల బారిన పడి అల్లాడుతున్న ప్రజల గోడు పట్టించుకోవడం మానేసి అధికారపక్షం నేతలు చంద్రబాబు ఇంటిపై రాజకీయాలు చేస్తున్నారని టిడిపి ఆరోపిస్తున్నది.
ఈ విమర్శల్లో నిజానిజాలు సంగతి ఎలాఉన్నా పైనుంచి ఎంత వరద ప్రవాహం వస్తుందో ఖచ్చింతగా తెలిసిన తర్వాత కూడా కృష్ణానది వరద నిర్వహణ విషయంలో ప్రభుత్వం విఫలమయిందన్న మాట నది దిగువ ప్రాంతాలలో వినబడుతున్నది.
కృష్ణానది కరకట్టపై ఉన్న ప్రతిపక్షనేత చంద్రబాబు ఇంటి విషయానికి మళ్లీ వస్తే, ప్రయివేటు వ్యక్తులు నది ఒడ్డున అలాంటి కట్టడాలు నిర్మించడం ఎంత తప్పో ఈ వరదలు మరోసారి నిరూపిస్తున్నాయి. అక్రమ కట్టడమంటూ అధికారంలోకి వచ్చిన వెంటనే ప్రజావేదికను కూల్చిన జగన్ ప్రభుత్వం ఆ తర్వాత నదీగర్భానికి ఇంకా దగ్గరగా ఉన్న ఏ ఒక్క భవనాన్నీ కూల్చలేకపోయింది.
ఎందుకంటే, కట్టగూడని ప్రాంతంలో కట్టినా ఆ నిర్మాణాలన్నీ ప్రభుత్వ యంత్రాంగం అనుమతితో కట్టినవే. చంద్రబాబు ఇప్పుడు ఉంటున్న ఇంటికి వైఎస్ రాజశేఖర రెడ్డి హయాంలో అనుమతి దొరికిందని దాని యజమాని చెబుతున్నారు. కింది స్థాయి యంత్రాంగం అవినీతికి పాల్పడితే, అక్రమాలు చేస్తే అవన్నీ ముఖ్యమంత్రికి తెలియక్కరలేదు. కానీ విషయం బయటకువచ్చిన తర్వాత జవాబుదారీతనం గురించి చర్చ సహజం.
నది ఒడ్డున అక్రమంగా భవానాలు లేపారని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అంటున్న మాటల్లో వివాదానికి తావులేదు. నిబంధనల్లో ఉన్న ఏ లొసుగును ఆసరాగా తీసుకుని అలాంటి కట్టడాలకు అనుమతి ఇచ్చారో పరిశీలించాలి. తగిన చర్యలు తీసుకోవాలి. ఇప్పటికే ఉన్న కట్టడాల విషయంలో ఏం చెయ్యాలో ప్రభుత్వం జాగ్రత్తగా ఆలోచించి ఒక నిర్ణయం తీసుకోవాలి. ఈ లోపు వరద వస్తే నది ఒడ్డున ఎవరి ఇల్లయినా మునుగుతుంది. మాజీ ముఖ్యమంత్రి ఇల్లు అయినా, రోజూ దేవుడు పూజలు అందుకునే ఆశ్రమమయినా వరదకేం లెక్క, రాజకీయనాయకులకు తప్ప!
సురయ్యా